కరోనా వ్యాక్సిన్తో జంబలకిడి పంబ.. జనంలో విపరీత గందరగోళం.. బెంబేలెత్తించిన దేశాధ్యక్షుడు..
ప్రపంచమంతా ఓ దారైతే... బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోది మరో దారి... ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ను తీసుకొద్దామా అని దేశాధ్యక్షులంతా ఆరాటపడుతుంటే.. బోల్సోనారో మాత్రం దానితో పనే లేదంటున్నారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అని బ్రెజిల్ సుప్రీం కోర్టు చెప్పినా సరే తన దారి తనదే అంటున్నారు. తనకు వ్యాక్సిన్ అవసరం లేదని... ఇప్పటికే తన శరీరంలో కోవిడ్ 19 యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తాజాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు,కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకునేవాళ్లు కూడా బెదిరిపోయేలా విచిత్రమైన కామెంట్స్ చేశారు.
'జంబలకిడి పంబ..'ను గుర్తు చేసేలా...
'నేను కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోను. ఎందుకంటే ఇప్పటికే నాకు కరోనా సోకింది.. శరీరంలో కరోనా యాంటీబాడీలు కూడా తయారయ్యాయి. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుని ఏ చింపాంజీ లాగో లేక మొసలి లాగో మారిపోతే... ఒకవేళ మహిళలకు గెడ్డం వచ్చి,పురుషుల గొంతు మహిళల్లా సన్నగా మారిపోతే అది వాళ్ల సమస్యనే అవుతుంది. అంతే తప్ప ఫైజర్ దానికి ఎలాంటి బాధ్యత వహించదు.' అని జైర్ బోల్సోనారో వ్యాఖ్యానించారు. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బోల్సోనారో చేసిన ఈ వ్యాఖ్యలు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారిని భయభ్రాంతులకు,లేని పోని అపోహలకు గురిచేసేలా ఉన్నాయి. అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన జంబలకిడి పంబ సినిమాను గుర్తు చేసేలా బోల్సోనారో వ్యాఖ్యలు ఉన్నాయి.
ఫైజర్పై బోల్సోనారో ఫైర్...
ఇప్పటికే యూకె,యూఎస్లలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఫైజర్ వ్యాక్సిన్ను బోల్సోనారో టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి ఫైజర్ ఎలాంటి బాధ్యత వహించట్లేదని బోల్సోనారో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఫైజర్తో 70మిలియన్ల డోసుల కోసం బ్రెజిల్ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు ఈ నెల ప్రారంభంలో కథనాలు వచ్చాయి. బ్రెజిల్లో వ్యాక్సిన్ను నమోదు చేసుకునేందుకు ఫైజర్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న కథనాలూ వచ్చాయి. కానీ ఇంతలోనే బోల్సోనారో ఫైజర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతోంది.
గందరగోళంలో జనం...
కరోనా వ్యాక్సినేషన్పై గురువారం(డిసెంబర్ 17) బ్రెజిల్ సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. అయితే ఈ విషయంలో బలవంతం ఉండదని పేర్కొంది. కోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అయితే తీర్పుకు సంబంధించిన కాపీలో సుప్రీం కోర్టు జడ్జి రికార్డో లెవాన్డౌస్కీ... వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు పలు విషయాల్లో ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొనడం గమనార్హం. అటు అధ్యక్షుడు బోల్సోనారో కూడా వ్యాక్సినేషన్ విషయంలో బలవంతమేమీ ఉండదని పేర్కొన్నారు. బలవంతం లేదంటూనే,ఆంక్షలు విధిస్తామని సుప్రీం కోర్టు చెప్పడం... వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో అసాధారణ మార్పులు సంభవిస్తే ఫైజర్ బాధ్యత వహించదని బోల్సోనారో పేర్కొనడంతో ఇప్పుడక్కడి జనాల్లో వ్యాక్సిన్ పట్ల విపరీతమైన గందరగోళం నెలకొంది.
పెరుగుతున్న కేసులు...
ఇటీవలి కాలంలో బ్రెజిల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం(డిసెంబర్ 17) ఒక్కరోజే దాదాపు వెయ్యి మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అమెరికా తర్వాత అత్యధికంగా బ్రెజిల్లోనే 69,826 మంది కరోనాతో చనిపోయారు. నవంబర్ రెండో వారం నుంచి కరోనా సెకండ్ వేవ్ కారణంగా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం వ్యాక్సిన్ని నిరాకరిస్తుండటం,మాస్కులు ధరించడంపై అలసత్వంగా మాట్లాడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.