చైనాను రెచ్చగొట్టిన జో బైడెన్: కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్: పరోక్షంగా భారత్కూ..!
బ్రస్సెల్స్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నెల రోజులు దాటేసింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం రావణకాష్ఠంలా మండుతూనే ఉంది. రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్లోని కీలక నగరాలు ధ్వంసం అయ్యాయి. మరుభూమిగా మారాయి.

జీ20 నుంచి అవుట్..?
ఉక్రెయిన్పై దండెత్తిన రష్యాపై పాశ్చాత్య దేశాలన్నీ వ్యతిరేకంగా నిలిచాయి. యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలు.. రష్యాపై భగ్గుమంటోన్నాయి. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలు, నిషేధాలను జారీ చేశాయి. తాజాగా జీ 20 నుంచి కూడా బహిష్కరించడానికి పావులు కదుపుతున్నాయి. రష్యాతో దశాబ్దకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని భారత్తో పాటు చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే తటస్థంగా ఉంటూ వస్తోన్నాయి. అలాగనీ- యుద్ధాన్ని సమర్థించట్లేదు. యుద్ధం నిలిపివేయాలంటూ భారత్.. తన గళాన్ని వినిపిస్తూనే ఉంది.

అంతర్జాతీయ మద్దతు కోసం అమెరికా..
రష్యాకు వ్యతిరేక కూటమి దేశాలకు అమెరికా నాయకత్వాన్ని వహిస్తోంది. ఈ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి వ్యూహాలు పన్నింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఏర్పాటైన నాటో సభ్య దేశాల అత్యవసర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమ్మిట్ను ఉద్దేశించి- ప్రసంగించారు. రష్యాపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. జీ 20 నుంచి తప్పించాలని సూచించారు.

చైనాకూ వార్నింగ్..
చైనాకు జో బైడెన్ హెచ్చరికలను జారీ చేశారు. రష్యాకు మద్దతు పలికితే- కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో సమానంగా ఆర్థిక పరమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలను ఎదుర్కొనక తప్పదని అన్నారు. ఈ విషయంపై తాను కిందటి వారమే చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడానని బైడెన్ వివరించారు. తాను చెప్పదలచుకున్నది సూటిగా తేల్చేశానని వ్యాఖ్యానించారు. రష్యాకు సహకరించ వద్దని తాను కోరానని అన్నారు.

చైనా తీరు పట్ల బైడెన్ అనుమానాలు..
చైనా వ్యవహరిస్తోన్న తీరును చూస్తోంటే- గ్ఝి జిన్పింగ్.. రష్యాకు సహకరిస్తోన్నట్టే కనిపిస్తోందని జో బైడెన్ అభిప్రాయపడ్డారు. అందుకే ఇఫ్పుడు తాను మరోసారి నాటో వేదికగా చైనాను హెచ్చరిస్తోన్నానని స్పష్టం చేశారు. రష్యాతో పోల్చుకుంటే- అన్ని పాశ్చాత్య దేశాలతో చైనా బలమైన ఆర్థిక సంబంధాలను కలిగివుందని, అవన్నీ దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని బైడెన్ అన్నారు. పరిస్థితిని చైనా ఇక్కడి దాకా తీసుకుని రాకపోదని తాను ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. రష్యాకు సహకరించే విషయంలో దాని మిత్ర దేశాలు ఒకసారి పునరాలోచించాలనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయింది.

ఆ రెండు దేశాలు బ్రెడ్ బాస్కెట్
రష్యా, ఉక్రెయిన్- మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలకు బ్రెడ్ బాస్కెట్లాంటివని బైడెన్ పేర్కొన్నారు. అధిక మొత్తంలో ఆహారాన్ని సరఫరా చేస్తోన్నాయని, అలాంటి దేశాలు యుద్ధానికి దిగడం వల్ల ఆహార కొరత ఏర్పడిందని అన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జో బైడెన్ సమర్థించుకున్నారు. తాము ఆంక్షలను విధించింది రష్యాపై మాత్రమే కాదని.. పరోక్షంగా అన్ని యూరప్ దేశాలు.. చివరికి అమెరికాకు సైతం ఇవి వర్తిస్తాయని అన్నారు.

కెనడా నుంచి
భవిష్యత్తులో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉండటం వల్ల ప్రత్యామ్నాయ సరఫరా కోసం అన్వేషిస్తోన్నామని, ఇందులో భాగంగా జీ7, కెనడాల నుంచి సరఫరా చేయాలని భావిస్తున్నామని జో బైడెన్ అన్నారు. ఆహార ఉత్పత్తిలో కెనడా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆహార సరఫరాపై విధించిన ఆంక్షలను పరిమితంగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. జీ 20 కూటమి నుంచి రష్యాను తప్పించడంపై కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications