విపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ ఆఫర్-పార్లమెంటు రద్దు-ఎన్నికలు- అవిశ్వాసానికి సుప్రీం బ్రేక్?
పాకిస్తాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై త్వరలో ఓటింగ్ జరగనుండగా.. ఆ లోపే మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ రాజీనామా చేస్తారని అంతా భావిస్తున్నారు. అయితే అలా అనుకుంటున్న విపక్షాలకు షాకిస్తూ ఇమ్రాన్ ఖాన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అదే సమయంలో ఇమ్రాన్ తన హత్యకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పాక్ లో అనూహ్య పరిణామాలు
పాకిస్తాన్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ కు రాకముందే అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా రాదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ రాజీనామా అంచున వేలాడుతుండగా.. ప్రధాని మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. అంతే కాదు విపక్షాలకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు.
విపక్షాలకు ఇమ్రాన్ ఆఫర్
తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎలాగో పదవి పోవడం ఖాయమని తేలిపోవడంతో విపక్షాలకు ఇమ్రాన్ కొత్త ఆఫర్ ఇచ్చారు. దీని ప్రకారం విపక్షాలు తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తానని ఆయన ఆఫర్ ఇచ్చారు. తద్వారా ఓటమిని ఒప్పుకుంటున్నా.. ప్రజల్లోకి వెళ్లి ఎవరేంటో తేల్చుకుందా అంటూ విపక్షాలకు సవాల్ కూడా విసిరినట్లయింది.
ఇవాళ జాతినుద్దేశించి ఇమ్రాన్ ప్రసంగం
అవిశ్వాస గండం ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే రాజీనామా చేస్తారని అంతా భావించినా ఆయన మాత్రం తాజా పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పన్నిన కుట్రల్ని ప్రధాని హోదాలో ప్రజలకు తెలియజేయాలని ఆయన భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఆయన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ముందు రాజీనామా చేస్తారని చెప్తున్నారు.
Recommended Video
అవిశ్వాసానికి పాక్ సుప్రీంకోర్టు బ్రేక్?
ఇమ్రాన్ ఖాన్ తనపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగి, ఓటింగ్ జరగకముందే సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అయితే అవిశ్వాస తీర్మానానికి వెళ్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాత్కాలికంగా అయినా దీనికి బ్రేక్ వేసేలా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.