యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో, మోడీ చేతుల్లో ఉండదు: శాంతిచర్చలకు ఇమ్రాన్ పిలుపు
ఇస్లామాబాద్: భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొని ఉంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్.. పాక్లోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. దీంతో పాకిస్తాన్కు చెందిన విమానాలు భారత్ సరిహద్దుల్లోకి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందించాడు.
యుద్ధం ప్రారంభమైతే మా చేతిలో ఉండదు
ఇమ్రాన్ ఖాన్.. భారత్ను శాంతి చర్చలకు ఆహ్వానించారు. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే కనుక ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని చెప్పాడు. యుద్ధం ఆరంభమైతే అప్పుడు తన చేతిలో లేదా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కానీ ఉండదని హెచ్చరించాడు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదని చెప్పాడు. పుల్వామా ఉగ్రదాడిపై విచారణకు సహకరిస్తామని చెప్పాడు.
మా ఆధీనంలో ఐఏఎఫ్ పైలట్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) పైలట్ ఒకరు తమ ఆధీనంలో ఉన్నాడని ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. తాము రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జెట్ విమానాలను కూల్చివేశామని చెప్పాడు. పాక్ చర్చలకు సిద్ధమని చెప్పాడు. అర్థవంతంగా ఆలోచన చేయాలని చెప్పాడు. తమ భూభాగంలోకి వచ్చిన నేపథ్యంలో తమకు ప్రతిస్పందించడం మినహా మరో ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పాడు.
పుల్వామా ఘటనపై ఆధారాలు ఇస్తే
పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుమార్లు భారత్కు విజ్ఞప్తి చేశామని ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. మా భూభూగంలోకి మీరు వచ్చారని, మీ భూభాగంలోకి మేం వచ్చామని భారత వాయుసేన దాడి, అందుకు పాకిస్తాన్ చేపట్టిన దాడులను ప్రస్తావించారు. పుల్వామా, ఇతర అంశాలపై భారత్తో చర్చలకు సిద్ధమని చెప్పారు. అలాగే, మా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని చెప్పాడు.