ప్రధాని ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్ ఖాన్-అసెంబ్లీలో దొంగలతో కలిసి కూర్చోలేనని ప్రకటన
పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభానికి ఇంకా శుభం కార్డు పడలేదు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. అంతకు ముందే జాతీయ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు పదవులు వదులుకున్నారు. అయితే అవమానకర రీతిలో పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు విపక్షాలు నిలబెడుతున్న ప్రధాని అభ్యర్ధితో పోటీ పడేందుకు ఆసక్తి చూపడం లేదు.
త్వరలో జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగే ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. జాతీయ అసెంబ్లీలో దొంగలతో కలిసి కూర్చోబోనని ఆయన వెల్లడించారు. ఇమ్రాన్ఖాన్తో సహా పీటీఐ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రధాని ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అసెంబ్లీలో కూర్చోబోం.. ఈ దొంగలతో కలిసి అసెంబ్లీలో కూర్చోను' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
అలాగే ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ సభ్యులంతా వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేత షేక్ రషీద్ తెలిపారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ మంత్రి, తపాలా సేవల ఫెడరల్ మంత్రి మురాద్ సయీద్ తన రాజీనామాను నేషనల్ అసెంబ్లీ స్పీకర్కు పంపారు.
"వారి ధనదాహం, అధికార వ్యామోహం నా జాతిని బిచ్చమెత్తింది. బానిస మనస్తత్వం నా ఇళ్లను వధించే ప్రదేశంగా, నా ప్రజలను శరణార్థిగా మార్చింది, నా తల్లిని సజీవంగా సమాధి చేశారో, నేను అతన్ని ఈ దేశానికి అధిపతిగా పరిగణించాలా" అని ఆయన ప్రశ్నించారు. పీటీఐ నేతలు అలియా హంజా, అలీ జైదీ, అమీర్ డోగర్, ఫరూఖ్ హబీబ్ కూడా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.