రష్యాకు షాకిచ్చిన భారత్: ఉక్రెయిన్పై జీవాయుధాల దర్యాప్తు ఓటింగ్కు దూరం
న్యూఢిల్లీ: చాలా సార్లు రష్యాకు అనుకూలంగా వ్యవహరించిన భారత్.. ఈసారి మాత్రం షాకిచ్చింది. రష్యాకు ఏ మేరకు మద్దతు ఇవ్వాలో ఆ మేరకే ఇస్తూ.. మిగితా విషయాల్లో మాత్రం భారత్ తనదైనశైలిలో స్పందిస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఐక్యసమితి(యునైటెడ్ నేషన్స్)లో రష్యా తీసుకొచ్చిన మరో తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.
ఉక్రెయిన్ జీవాయుధాలు తయారు చేస్తోందని ఆరోపించిన రష్యా.. దానిపై దర్యాప్తు చేపట్టాలంటూ తీర్మానం తీసుకొచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించగా.. భారత్ అందులో పాల్గొనకుండా దూరంగా ఉంది. ఉక్రెయిన్ జీవాయుధాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికాతో కలిసి ల్యాబోరేటరీల్లో మిలిటరీ బయోలాజికల్ కార్యకలాపాలు సాగిస్తోందని ఱస్యా కొంత కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపైనే ఓ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానానికి మద్దతు లభించకపోవడంతో వీగిపోయింది. కేవలం రష్యాతోపాటు చైనా మాత్రమే దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వ్యతిరేకించాయి. భారత్ సహా భద్రతా మండలిలో మిగిలిన సభ్య దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనూ ఐక్యరాజ్యసమితి వేదికగా ఉక్రెయిన్ పై తీసుకొచ్చిన పలు తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. అయితే, రష్యా తీసుకొచ్చిన తీర్మానానికి సంబంధించి ఓటింగ్కు దూరంగా ఉండటం ఇదే మొదటి కావడం గమనార్హం.