59 యాప్లపై నిషేధం: చైనాలో ఇదే ట్రెండింగ్ టాపిక్, భారత ఉత్పత్తులపై సెటైర్లు
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దులో దొంగదారిన భారత సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్లను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది.
Recommended Video

చైనా అక్కసు..
ఈ నేపథ్యంలో తమ దేశ యాప్లను నిషేధించడంపై చైనా ప్రభుత్వంతోపాటు చైనా ప్రజలు కూడా అక్కసును వెల్లగక్కుతున్నారు. తమ దేశానికి చెందిన యాప్లపై నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదని చైనా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టిన చైనా సంస్థలపైనా ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

చైనాలో ట్రెండింగ్ టాపిక్.. ఎందుకిలా?
59 యాప్లను భారత్ నిషేధించడం అనే విషయం ఇప్పుడు చైనాలో హాట్టాపిక్ గామారింది. చైనా సోషల్ మీడియాలో ఇదే అంశం ట్రెండ్ అవుతోంది. అసలు చైనా యాప్లను భారత్ ఎందుకు నిషేధించిందని కారణాలు వెదుకుతున్నారు చైనీయులు. చైనా సోషల్ మీడియా యాప్ వైబోలో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకే దీనిపై 63 మిలియన్ల మంది చర్చించుకోవడం గమనార్హం.

భారత ఉత్పత్తులను వాడకూడదు..
59 యాప్లను భారత్ నిషేధించడంపై చైనాకు చెందిన ప్రజలు కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్పై అక్కసు వెల్లగక్కుతున్నారు. భారతదేశానికి చెందిన ఏ ఉత్పత్తులను కూడా చైనీయులు వాడకూడదని పిలుపునిస్తున్నారు. అయితే, ఇండియాకు చెందిన ఉత్పత్తులు చైనాలో ఎక్కడున్నాయని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

అసలు భారత ఉత్పత్తులు ఉంటేగా?
‘మనం కూడా ఇండియాకు చెందిన ఉత్పత్తులను బైకాట్ చేద్దాం. అయితే, మా ఇంట్లో ఇండియాకు చెందిన ఏ వస్తువు కూడా లేదు' అని ఓ యూజర్ తెలిపాడు. మరో యూజర్ కూడా ఇలాగే స్పందించాడు. తమ ఇంట్లో కూడా భారత ఉత్పత్తుల కోసం వెతికాను.. ఒక్కటి కూడా కనిపించలేదు అని వెల్లడించాడు.

భారత మీడియాపై ఆంక్షలు?
భారతీయ నెటిజన్లు వీపీఎన్ ద్వారా టిక్టాక్ను ఉపయోగిస్తారని మరో చైనా యూజర్ పేర్కొన్నాడు. అయితే, ఇప్పటి వరకు చైనాకు చెందిన సంబంధిత కంపెనీలు మాత్రం నిషేధం విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, చైనా మీడియా భారత నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఇక, భారతీయ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాపై తమ దేశంలో ఆంక్షలు విధించేందుకు చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చైనాలో భారత మీడియాకు చెందిన వెబ్సైట్లను ఇక మీదట వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) సర్వర్ ద్వారా మాత్రమే పొందగలిగేలా నిబంధనలు మార్చినట్లు సమాచారం. భారత టీవీ ఛానళ్లను ప్రస్తుతానికి ఐపీ టీవీ ద్వారా పొందవచ్చు.












Click it and Unblock the Notifications