గూగుల్ కొత్త సీఈవోగా భారత సంతతి సుందర్ పిచాయ్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (43) గూగుల్ అల్ఫాబేట్ కొత్త సీఈవోగా బాధ్యతలను స్వీకరించనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు.
ఆయన ఐఐటీ - ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టాను పొందారు. ఆయన 2004లో గూగుల్ సంస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి సీఈవో స్థాయికి చేరారు. కంపెనీ ఫౌండర్స్ లారీ పేజ్, సీర్జీ బ్రిన్ సుందర్ పిచాయ్కు సీఈవోగా బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.
అల్ఫాబేట్ పేరుతో...
ఇంటర్నెట్ సెర్చింజన్గా సేవలను ప్రారంభించిన గూగుల్, ఆపై డ్రోన్ల తయారీ, ఫార్మా, వెంచర్ కాపిటల్ ఇలా పలు రంగాలకు విస్తరించింది. తాజాగా కొత్తగా వినూత్న ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేసే నిమిత్తం గూగుల్ అల్ఫాబేట్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సుందర్ పిచాయ్ సీఈవోగా ఉంటారు.
అల్ఫాబేట్ పేరిట కొత్త జీవితం ప్రారంభమైందని, తనకు, సెర్గీకి ఇది ఎంతో ఆనందకరమైన రోజని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారీ పేజ్ అన్నారు. ఆల్ఫాబెట్ అనే పేరు తమకు ఎంతో నచ్చిందని, ఆల్ఫాబెట్ అంటే, కొన్ని అక్షరాల సముదాయమన్నారు.
మానవులు కనుగొన్న అత్యంత వినూత్నతల్లో ఇది ఒకటి అని, అందుకే ఈ పేరును ఎంచుకున్నామని చెప్పారు. 1998లో సెర్చ్ వ్యాపారానికి సహ వ్యవస్థాపకుడిగా ఉన్న సెర్గీ బ్రిన్తో కలసి ఈ కొత్త సంస్థను నిర్వహించనున్నామన్నారు. గూగుల్ సంస్థ ఇకపై సుందర్ పిచాయ్ నేతృత్వంలో సాగుతుందన్నారు.