ఇరాన్ లోనూ భారత్ ను వదలని ట్రంప్..! చబహార్ పై అమల్లోకి ఆంక్షలు..!
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో మన దేశంపై భారీగా సుంకాలు విధిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు మరోసారి కేంద్రాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఇప్పటివరకూ భారతీయ ఎగుమతులపై సుంకాల మోతతో భయపెడుతున్న ట్రంప్.. ఈసారి మాత్రం ఇరాన్ తో పాటు భారత్ పైనా ప్రభావం చూపే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒకేసారి ఇరు దేశాల్నీ ఇబ్బంది పెట్టబోతున్నారు. దీనికి ఎలా కౌంటర్ ఇవ్వాలనే దానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.
చబహార్ పోర్టుపై ఆంక్షలు
ఇరాన్ లో భారత్ చబహార్ పోర్టు నిర్మిస్తోంది. పశ్చిమాసియాలో వ్యూహాత్మకంగా పట్టు కోసం కేంద్రం గతంలో ఈ మేరకు ఇరాన్ తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ యుద్దం తర్వాత ఇరాన్ పై ఆగ్రహంగా ఉన్న ట్రంప్.. భారత్ తో పాటు ఆ దేశాన్నీ ఇబ్బంది పెట్టేలా ఆంక్షలకు తెరలేపారు. చబహార్ పోర్టుపై ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. అనుకున్నట్లుగానే ఈ నిర్ణయాన్ని అమల్లోకి కూడా తెచ్చేశారు.

టార్గెట్ ఇరాన్ అణు కార్యక్రమం
ఇరాన్ అణు కార్యక్రమానికి నిధులు అందకుండా చేసేందుకు అమెరికా ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో భారత్ ఇరుక్కున్నట్లయింది. ఇప్పటికిప్పుడు ఇరాన్ తో తెగదెంపులు చేసుకుని చబహార్ పోర్టు ప్రాజెక్టు నుంచి భారత్ వైదొలగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఇరాన్ తో పాటు భారత్ కూడా భరించాల్సి ఉంటుంది. తాజాగా భారతీయ సినిమాలు, ఫర్నిచర్ ఎగుమతులపై ఏకంగా 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ లో పోర్టు విషయంలోనూ ఆంక్షల కొరడా ఝళిపించడం కేంద్రానికి మింగుడుపడటం లేదు.
చబహార్ ఒప్పందం
2018లో పాకిస్తాన్ ద్వారా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లేందుకు భారత్ కు ఇరాన్ లోని చబహార్ లో పోర్టు నిర్మాణం అవసరమైంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గ్వాదర్ ఓడరేవును చైనా అభివృద్ధి చేయడానికి కౌంటర్ గా భారత్ ఈ మార్గం ఎంచుకుంది. కానీ 2021లో తాలిబన్లు ఆప్ఘానిస్తాన్ లో అధికారం చేపట్టడంతో పరిస్దితి మారిపోయింది. ఆ తర్వాత అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో భారత్,ఇరాన్ పై కక్షసాధింపు ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు చబహార్ పోర్టుపై ఆంక్షలతో భారత్, ఇరాన్ ను కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

భారత్ పై ఆంక్షల ప్రభావం
ఈ ఆంక్షల వల్ల ప్రభుత్వ రంగ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్తో సహా భారతీయ సంస్థలు చబహార్ నుండి నిష్క్రమించడానికి 45 రోజుల సమయం ఉంది. లేదా వారి ఆస్తుల స్తంభన సహా ఇతర చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్దమవుతోంది. భారత్ ఈ పోర్టు కోసం పదేళ్లలో 370 మిలియన్ డాలర్లు ఇచ్చే ఒప్పందంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ చర్యపై భారత్ వేచిచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దూకుడు నిర్ణయాలకు బదులు వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలతో భాగస్వామ్యం పెంచుకోవడం ద్వారా దీనికి కౌంటర్ ఇవ్వాలని భారత్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications