ఫ్రెండు.. ఫ్రెండు అంటూ భారత్ కు గునపం దించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్లు దేశ వాణిజ్యం రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్ భారత్ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్ పై విధించాల్సిన టారిఫ్ ను దాదాపుగా ఫైనల్ చేస్తోంది అమెరికా. దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్ పై 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్ విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, తుది దశకు చేరుకున్నాయని అన్నారు.

ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. భారత్ తనకు మంచి స్నేహితుడని, ఇతర దేశాల కంటే ఎక్కువ టారిఫ్ తమపై విధిస్తోందని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందాలు చేసుకోని భాగస్వామ్య దేశాల ఎగుమతులపై 15 నుంచి 20 శాతం వరకు టారిఫ్ ను విధించబోతోన్నామని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని 200 దేశాలకు అందిస్తామని ఆయన తెలిపారు.
భారత్ నుంచి కాపర్ ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా 360 మిలియన్ డాలర్ల పైమాటే. అంటే మొత్తం రాగి ఎగుమతుల్లో ఇది 17 శాతం. అమెరికా భారత్ కు మూడవ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్. కాపర్ ఎగుమతుల్లో సౌదీ అరేబియా- 26, చైనా- 18 శాతం అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశ ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై విధించబోయే టారిఫ్ 200 శాతానికి పైగా ఉండే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇది ఇప్పటికప్పుడు కాకపోయినా.. వచ్చే ఏడాది కాలంలో దశలవారీగా పెంచుకుంటూ వెళ్తామని అన్నారు. తమకు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసే భాగస్వామ్య దేశాలకు ఏడాది నుంచి ఏడాదిన్నర గడువు ఇస్తామని, ఆ తర్వాత టారిఫ్లు విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు.
మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ రంగాల్లో కాపర్ వినియోగం విస్తృతంగా ఉంటోంది. అమెరికాలో డిమాండ్ తగ్గినా కూడా దేశీయ కాపర్ పరిశ్రమపై ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఈ టారిఫ్ గండం నుంచి భారత్ తేలిగ్గానే బయటపడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు సంబంధించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్ నాటికి అమెరికాతో మంచి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సత్వరంగా చర్చలు జరుగుతున్నాయని, పరస్పర సహకారంతో ఇరు దేశాలకు లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ మాట్లాడుతూ భారత్తో చర్చలకు మరింత సమయం పడుతుందని, ట్రంప్ విన్ టు విన్ ఒప్పందాలకే ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. భారత్ తన దేశీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నప్పటికీ, కొన్ని రంగాల్లో ఓపెన్ మార్కెట్ కు అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications