కాశ్మీర్పై మోడీ అంతా చెప్పారు: ఇమ్రాన్కు ఫోన్ చేస్తానంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
ప్యారిస్: కాశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్థాన్ దేశాలే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, మూడో పార్టీ ఏది కూడా తలదూర్చదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఫ్రాన్స్ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది.
అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. రక్షణ, ఉగ్రవాదం, పరస్పర సహకారం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. సుమారు 90 నిమిషాలపాటు ఈ ఇద్దరు నేతల సమావేశం జరిగింది. వీరి భేటీ ప్యారిస్కు 50 కిలోమీటర్ల దూరంలోని చాటే డి చాంటిల్లి భవనంలో జరిగింది. ఫ్రెంచ్ సాంస్కృతిక వారసత్వ ఉత్తమ ఆభరణాలుగా ఈ ప్రాంతాన్ని వర్ణిస్తారు. ఇరుదేశాల నేతల చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

మోడీ చెప్పారు..
అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జమ్మూకాశ్మీర్పై తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోడీ తనకు వివరించారని మాక్రాన్ తెలిపారు. ఇది భారత అంతర్గత విషయమని, సార్వభౌమత్వానికి లోబడి చేసిందేనని ఆయన అన్నారు.
ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలో శాంతిని స్థాపించేందుకు భారత్, పాకిస్థాన్ చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని మాక్రాన్ పిలుపునిచ్చారు. అక్కడి ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలని వ్యాఖ్యానించారు. అంతేగాక, తాను కొద్ది రోజుల తర్వాత పాకిస్థాన్ ప్రధానితో మాట్లాడతానని ప్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తెలిపారు. కాశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని ఇమ్రాన్ ఖాన్కు సూచిస్తానని మాక్రాన్ తెలిపారు.

వచ్చే నెలలో తొలి రఫేల్..
36 రఫేల్ యుద్ధ విమానాల్లో తొలి యుద్ధ విమానం వచ్చే నెల(సెప్టెంబర్)లో భారత్కు చేరుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, పరస్పర సహకారం వంటి అంశాలపై భారత్, ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రక్షణ, ఉగ్రవాదం అంశాలపై ఇరుదేశాలు సహకారాన్ని విస్తరించుకుంటాయని తెలిపారు.
‘మా ఇరుదేశాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఫ్రాన్స్ కు లభించిన విలువైన సహకారానికి అధ్యక్షుడు మాక్రాన్కు కృతజ్ఞతలు. భద్రత, ఉగ్రవాద నిరోధకతపై సహకారాన్ని విస్తృతం చేయాలని మేము భావిస్తున్నాం' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

సుసంపన్న ప్రపంచం కోసం..
వాతావరణ మార్పులు, సాంకేతికాభివృద్ధి వంటి అంశాలపై ఫ్రాన్స్, భారత్లు ఏకతాటిపై ఉన్నాయని చెప్పారు. సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం కోసం భారత్, ఫ్రాన్స్ కృషి చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉగ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రముప్పుపై గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్న భారత ప్రతిపాదనపై ఇరుదేశాలు అంగీకరించాయి.

మోడీకి ఘన స్వాగతం.. తొలి ప్రధానిగా..
అంతకుముందు గురువారం ప్యారిస్ చేరుకున్న ప్రధాని మోడీకి ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ వెస్ లె డ్రియాన్ స్వాగతం పలికారు. కాగా, శుక్రవారం కూడా మోడీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మోడీ.. ఇక్కడి భారత సంతతి పౌరులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్ దేశాల్లో ఆగస్టు 26 వరకు పర్యటించనున్నారు. గా, బహ్రెయిన్ లో పర్యటించే తొలి భారత ప్రధాని మోడీనే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications