ఆంక్షలతో మొదటికే మోసం: భారత్ పై ఆంక్షల విషయంలో యోచిస్తున్న అమెరికా
భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ రష్యాలు పలు రక్షణ ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఐదు యూనిట్ల ఎస్-400 మిస్సైల్ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అమెరికా రంగంలోకి దిగింది. రష్యాతో భారత్ తెగదెంపులు చేసుకోవాలని సూచిస్తోంది. రష్యాతో లావాదేవీలు రద్దు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది అగ్రరాజ్యం అమెరికా.
Recommended Video


క్యాట్సా చట్టం తీసుకొచ్చిన అమెరికా
అమెరికాకు బద్ధ శత్రువులైన పలుదేశాలతో అమెరికా మిత్రదేశాలు ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకూడదని తెలుపుతూ అమెరికా ప్రభుత్వం కౌంటరింగ్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (క్యాట్సా) పేరుతో ఓ చట్టాన్ని రూపొందించింది. ఇక అమెరికా శతృదేశాలైనా ఇరాన్, ఉత్తరకొరియా, రష్యాలతో విస్తృతంగా వాణిజ్యం వ్యాపారాలు నిర్వహించరాదని అమెరికా తమ మిత్రదేశాలపై ఆంక్షలు విధించింది. రష్యా నుంచి చమురు, సహజ వాయు పరిశ్రమ, రక్షణ, భద్రతా రంగాలను ఆంక్షలకు లక్ష్యంగా ఎంచుకుంది.

ఎస్-400 మిస్సైల్ కొనుగోలుకు ఒప్పందం
భారత రక్షణ వ్యవస్థలో ఉన్న అత్యధిక ఆయుధాలు రష్యా నుంచి కొనుగోలు చేసినవే కావడం, డిఫెన్స్ పార్ట్నర్గా రష్యా ఒక్కదేశంతోనే సత్సంబంధాలను భారత్ నెరుపుతోంది. ఈ క్రమంలోనే రష్యా నుంచి ఎస్-400 మిస్సైల్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్ను హెచ్చరిస్తోంది. అయితే ఇదే విషయమై మోడీ సర్కార్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు గత కొద్దిరోజులుగా అమెరికా ప్రభుత్వంతో ఆంక్షలు ఎత్తివేయాల్సిందిగా కోరుతూ చర్చలు జరుపుతున్నారు. ఒక్క రష్యా నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.

అమెరికాహెచ్చరికలను సీరియస్గా తీసుకోనవసరం లేదు
మిలియన్ డాలర్ల విలువైన ఎస్-400 రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో అమెరికా తాజా హెచ్చరికలు చేసింది. ‘క్యాట్సా' పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపైనా ఆంక్షలు ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ మిత్ర పక్షాలను, భాగస్వామ్య దేశాలను ఈ విషయంలో మరోమారు ఆలోచించాల్సిందిగా కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు విశ్లేషకులు మాత్రం అమెరికా హెచ్చరికలను కొట్టిపడేశారు. ఎస్-400 విషయంలో భారత్ ముందుకెళ్లినా అమెరికా చేసేదేమీ ఉండదని, ప్రకటనలకు, హెచ్చరికలకే అది పరిమితమవుతుందని చెబుతున్నారు.

భారత్పై ఆంక్షలు విధిస్తే అమెరికాకే నష్టం
రష్యాతో భారత్ సంబంధాలకు సంబంధించి ఆంక్షలు ఎత్తివేయాలని గతకొద్దిరోజులుగా భారత ఉన్నతాధికారులు అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై అమెరికా కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రష్యాతో భారత్ సంబంధాలపై అమెరికా అడ్డు తగిలితే భారత్ అమెరికాల మధ్య ఉన్న మంచి సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని భావిస్తోంది. ఇలా జరిగితే పొరుగు దేశమైన చైనాతో పాటు రష్యాతో భారత్ సత్సంబంధాలు బలపడే అవకాశం ఉందని అగ్రరాజ్యం యోచిస్తోంది.












Click it and Unblock the Notifications