మిషన్ శక్తిపై అమెరికా అక్కసు ఐఎస్ఎస్కు ముప్పు పెరిగిందన్న నాసా
మిషన్ శక్తి ప్రయోగంతో అగ్రదేశాల సరసన నిలిచిన భారత్పై అమెరికా మండిపడుతోంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత అంతరిక్షంలో ఉపగ్రహాలను పేల్చేయగల సత్తా సంపాదించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై నాసా అక్కసు వెళ్లగక్కింది. ఈ ప్రయోగంతో స్పేస్ జంక్ మరింత పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అంటోంది.

ఏశాట్ ప్రయోగంతో 400 శకలాలు
గతవారం భారత్ నిర్వహించిన యాంటీ శాటిలైట్ ప్రయోగంతో అంతరిక్షంలో దాదాపు 400 ఉపగ్రహ శకలాలు ఏర్పడ్డాయని నాసా ప్రకటించింది. మిషన్ శక్తి ప్రయోగాన్ని ఒక భయంకరమైన చర్యగా అభివర్ణించింది. ఈ శకలాల కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)కు ముప్పు వాటిల్లే అవకాశముందని నాసా చీఫ్ జిమ్ బ్రీడెన్స్టీన్ అన్నారు. ఇప్పటి వరకు పెద్ద పరిమాణంలో ఉన్న వ్యర్థాలను మాత్రమే గుర్తించామని, వాటిలో 10 సెంటీమీటర్లకుపైగా పరిమాణం ఉన్న 60శకలాలు ఉన్నాయని అన్నారు.

ఐఎస్ఎస్కు పొంచి ఉన్న ముప్పు
ఏ శాట్ ప్రయోగం ద్వారా భారత్ 300కిలోమీటర్ల ఎత్తులో గల శాటిలైట్ను ధ్వంసం చేసింది. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు దిగువనే ఉన్నప్పటికీ శాటలైట్ను పేల్చడం ద్వారా ఏర్పడ్డ 24 శకలాలు ఐఎస్ఎస్ కక్ష్యపై తిరుగుతున్నాయని బ్రీడెన్స్టీన్ అంటున్నారు. భారత్ చర్య ఫలితంగా ఐఎస్ఎస్కు ముప్పు వాటిల్లే అవకాశముందని, అంతరిక్షంలో మానవ మనుగడకు ఇది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

44శాతం ముప్పు పెరిగిందన్న నాసా
మిషన్ శక్తి ప్రయోగం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నాసా అభిప్రాయపడింది. ఈ అంతరిక్ష శకలాల ద్వారా వాటిల్లే ముప్పుపై దృష్టి సారించినట్లు చెప్పింది. ఐఎస్ఎస్ను ఢీకొట్టే అవకాశమున్న శకలాలను అమెరికా సైన్యం పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. ఏశాట్ ప్రయోగంతో వెలువడిన శకలాలు రానున్న పది రోజుల్లో ఐఎస్ఎస్ను ఢీకొట్టే అవకాశం 44శాతం పెరిగిందని, ఈ వ్యర్థాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతే ముప్పు కొంత వరకు తగ్గుతుందని వివరించింది.












Click it and Unblock the Notifications