సౌరశక్తిపై అంతర్జాతీయ దౌత్య హోదాలో భారత్-ఐరాసలో ముసాయిదా తీర్మానం-ఆమోదిస్తే
అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో సౌర విద్యుత్ రూపంలో హరిత శక్తిని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్-ఫ్రాన్స్ ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సౌర దేశాల కూటమికి పరిశీలక హోదా ఐరాసలో చర్చకు రానుంది. ఇందుకోసం భారత్ ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య హరిత శక్తిని ప్రోత్సహించేందుకు వీలుగా అంతర్జాతీయ సౌర కూటమి చేసే ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు భారత్-ఫ్రాన్స్ తో కూడిన అంతర్జాతీయ సౌర కూటమి పరిశీలక హోదా కోరుతోంది. ఇందులో భాగంగా భారత్ తాజాగా ఇరు దేశాల తరఫున ఐరాస సాధారణ సభలో ఓ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఐరాస సాధారణ సభ సమగ్రంగా చర్చించి అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)కి పరిశీలక హోదా ఇచ్చేందుకు వీలుగా ఓ తీర్మానం చేయాల్సి ఉంది.
2015 లో పారిస్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (COP21) 21వ సమావేశంలో భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇరుదేశాలూ తమ దేశాల్లో సౌర శక్తిని ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయంగా కూడా సౌర శక్తి విషయంలో దౌత్యం నెరుపుతున్నాయి. ఐరాసలో తాజాగా అంతర్జాతీయ సౌర కూటమికి పరిశీలక హోదా కోసం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందితే అధికారికంగానే భారత్-ఫ్రాన్స్ అంతర్జాతీయ ఈ దౌత్యం నెరిపేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
ఐరాసలో అంతర్జాతీయ కూటమికి పరిశీలక హోదా ఇచ్చేందుకు వీలుగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఈ ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా "తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నేను గౌరవంగా భావిస్తున్నాను.. భారత్, ఫ్రాన్స్ తరపున దాదాపు 80 మంది సహ స్పాన్సర్లతో కలిసి అంతర్జాతీయ సౌర కూటమి కోసం పరిశీలక హోదాను మంజూరు చేయడం కోసం దీన్ని ప్రవేశపెడుతున్నాను" అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి అన్నారు.
"సౌర శక్తి విస్తరణ ద్వారా న్యాయమైన మరియు సమానమైన శక్తి పరిష్కారాలను తీసుకురావడానికి అంతర్జాతీయ సౌర కూటమి తన ప్రయత్నాల ద్వారా గ్రీన్ ఎనర్జీ దౌత్యం యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు," అని తిరుమూర్తి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.