చైనాకు భారత్ సాయం-అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి వేళ-ఎందులోనో తెలుసా ?
కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు భారత్ తాజాగా పరోక్ష మద్దతు ప్రకటించింది. కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయంటూ అమెరికా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై బహిరంగ చర్చను నివారించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. ఈ మేరకు తాజాగా ముగిసిన బ్రిక్స్ సదస్సులో చైనాకు హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.. త్వరలో జరిగే ఎస్సీవో (SCO) సదస్సులోనూ ఇదే వైఖరి అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి
గతేడాది చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మహమ్మారి ప్రపంచ దేశాల్ని పట్టి కుదిపేసింది. దాదాపు అన్ని దేశాలూ ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డాయి. భారత్ సహా పలు దేశాల్లో కోట్లాది మంది ప్రజలు చనిపోయారు. ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు వ్యాప్తి చెందింతో తెలియక ముందే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు బాధితులుగా మారిపోయాయి. ఇప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. దీన్ని ప్రపంచం నుంచి పూర్తిగా తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. దీంతో కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించిన వారిని దోషులుగా నిలబెట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
చైనా వుహాన్ ల్యాబ్ పైనే అనుమానాలు
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న అనుమానాలు ఆరంభం నుంచీ ఉన్నాయి. దీంతో అమెరికా సహా పలు ప్రపంచదేశాలు చైనాపై ఈ అంశాన్నే అడ్డుపెట్టుకుని విమర్శలకు దిగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మూలాలు చైనాతోనే ఉన్నాయని, ప్రపంచం ఇన్ని ఇబ్బందులు పడటానికి డ్రాగన్ దేశమే కారణమని నిందిస్తున్నాయి. దీంతో చైనాకు ప్రపంచ దేశాల మద్దతు కరువైంది. వాణిజ్యపరంగా ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదిగిన చైనా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆరోపణలుగా ఉన్న ఈ వ్యవహారం నిరూపితమైతే ప్రపంచం చైనాను బహిష్కరించే అవకాశాలూ లేకపోలేదు.
చైనాకు భారత్ పరోక్ష మద్దతు ?
కరోనా వైరస్ మూలాల విషయంలో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు పొరుగుదేశమైన భారత్ మాత్రం అండగా నిలిచింది. అయితే ఇది ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా మాత్రమే. కరోనా వైరస్ మూలాలపై జరుగుతున్న బహిరంగ చర్చకు దూరంగా ఉండాలని చైనా చేసిన ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. తాజాగా బ్రిక్స్ దేశాల సదస్సులో ఈ మేరకు ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు హామీ ఇచ్చారు. భారత్ తనంతట తానుగా కరోనా వైరస్ మూలాల చర్చను అంతర్జాతీయంగా తెరపైకి తీసుకురాబోదని హామీ ఇచ్చారు. దీంతో అంతర్జాతీయంగా ఈ విషయంలో చైనాకు భారీ ఊరట లభించినట్లయింది.
Recommended Video
భారత్ డిమాండ్ ఇదే
"ప్రపంచంలో పరిపాలనకు విశ్వసనీయత అనేది ఎంతో అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్వర్క్ కింద వైరస్ యొక్క మూలాలపై పారదర్శక దర్యాప్తు జరగాలి. దీనికి చైనాతో పాటు అన్ని దేశాల నుండి పూర్తి సహకారం అందాలి "అని బ్రెజిల్-రష్యా-ఇండియా-చైనా-దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ దేశాల సదస్సులో చేసిన ఉపన్యాసంలో ప్రధాని మోడీ డిమాండ్ చేశారు. త్వరలో తజికిస్దాన్లోని దుషాంబే ఆతిధ్యమిస్తున్న షాంఘై సహకార సమాఖ్య (SCO) సదస్సులో వర్చువల్ గా పాల్గొనబోతున్న భారత్, చైనా ఇదే డిమాండ్ కు కట్టుబడి ఉండబోతున్నట్లు కేంద్రం చెబుతోంది. కరోనా వైరస్ మూలాలపై జరిగే నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్ద విశ్వసనీయత పెరుగుతుందని భారత్ చెబుతోంది. తద్వారా అమెరికా ఒత్తిడికి తలొగ్గి చైనాపై డబ్ల్యూహెచ్ వో దూకుడుగా చర్యలు తీసుకునే ప్రమాదం తగ్గుతుందని ఆశిస్తోంది.