INDvsENG: కోవిడ్ భయంతో బరిలోకి దిగని భారత్ జట్టు.. ఐదో టెస్టు రద్దు.. సిరీస్ 2-2తో సమం అవుతుందా?

ఓల్డ్ ట్రాఫోర్డ్లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దైంది. భారత బృందంలోని సభ్యులకు కోవిడ్-19 సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని కేసులు వ్యాప్తి చెందుతాయనే భయంతో భారత్ జట్టు బరిలోకి దిగలేకపోతోంది.
ఈ వార్త చెబుతూ అభిమానులు, భాగస్వాములకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు క్షమాపణలు తెలిపింది.
''ఇది చాలా మందికి తీవ్ర నిరాశ, అసౌకర్యాన్ని కలిగిస్తుందని మాకు తెలుసు''.
సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్, చివరి టెస్టును కోల్పోయిందని, సిరీస్ 2-2తో డ్రా అయినట్లు ఈసీబీ తొలుత తన ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత సవరించిన ప్రకటనలో ''భారత్ టీమ్ను బరిలోకి దించలేకపోయింది'' అని చెప్పింది.
కాగా, తుది ఫలితంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది.
భారత్ నాలుగో టెస్టును గెలుచుకున్న సమయంలో జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటే ఐసోలేషన్లోకి వెళ్లారు.
సిబ్బందిలో మరొక సభ్యుడికి నిర్వహించిన పరీక్షల్లో గురువారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
భారత్ గురువారం జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకుంది. ఆ వెంటనే చేసిన పరీక్షల్లో ఆటగాళ్లలో ఎవరికీ కరోనా సోకలేదని తేలింది. దాంతో ప్రణాళిక ప్రకారమే టెస్టు మ్యాచ్ జరుగుతుందని ప్రకటించారు.
అయితే, మాంచెస్టర్లో మ్యాచ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
2020లో ఇంగ్లండ్ లో ప్రణాళిక ప్రకారం జరగాల్సిన మ్యాచ్ లను కరోనా మహమ్మారి కారణంగా రీషెడ్యూల్ చేశారు. కానీ, కరోనా కారణంగా ఇలా రద్దు చేసిన తొలి మ్యాచ్ మాత్రం ఇదే.
కరోనా వైరస్ భయంతో ఇంగ్లండ్ డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో మూడు వన్డే అంతర్జాతీయ మ్యాచ్లను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఐదో టెస్టును రీషెడ్యూల్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అడ్డంకిగా మారుతుంది. ఈ లీగ్ ఈ నెల 19న పునఃప్రారంభం కావాల్సివుంది.
భారతదేశంలో జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్ మేలో వాయిదా పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మళ్లీ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ కోసమే ఇలా జరిగిందా?
బీబీసీ క్రికెట్ కరస్పాండెంట్ జోనాథన్ అగ్న్యూ విశ్లేషణ
ఇది చాలా వింతగా ఉంది. ఎందుకంటే గత రాత్రి ఆటగాళ్లకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షల్లో కరోనా సోకనట్టు స్పష్టంగా తెలిసింది. మ్యాచ్ జరుగుతుందని మేం భావించాం.
ఐపీఎల్తో దీనితో సంబంధం ఉందని నేను అనుమానిస్తున్నాను. ఈ లీగ్ మరో 10 రోజుల్లో ప్రారంభమవుతుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ)కి ఐపీఎల్ విలువ దాదాపు 3 వేల కోట్ల రూపాయలు.
వారు తమ వారిని కాపాడుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆటగాళ్ళు వారి ఒప్పందాలను కాపాడుకుంటారు. దీని వల్ల ఈసీబీ దాదాపు 203 కోట్ల రూపాయలు నష్టపోతుంది. బీసీసీఐతో దాని గురించి కొంత చర్చలు జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారు.
అద్భుతమైన సిరీస్లో కోవిడ్ జోక్యం చేసుకోవడం సిగ్గుచేటు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: పంజ్షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం
- ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా? :డిజిహబ్
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- ఫోర్డ్: భారత్కు గుడ్బై చెబుతున్న అమెరికన్ కార్ల కంపెనీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications