అసాధారణ చర్యలకు సిద్ధం: భారత్, జాదవ్ అప్పీల్ చేసుకోవచ్చు: పాక్, చంపేశారా?
గూఢచర్యం కేసులో భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాకిస్థాన్ మరణశిక్ష విధించడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజ ఆసిఫ్ స్పందించారు.
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాకిస్థాన్ మరణశిక్ష విధించడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజ ఆసిఫ్ స్పందించారు.
పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం జాదవ్కు విధించిన మరణశిక్షపై ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, పాక్ అధ్యక్షులు మామూన్ హుస్సేన్లకు 60 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చన్నారు.
జాదవ్ భారత ప్రభుత్వ విదేశాంగ నిఘా ఏజెన్సీ, రా సంస్థల తరఫున పని చేస్తున్నారని తేలడం వల్లే పాక్ మిలటరీ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చిందన్నారు. అందువల్లే మరణదండన విధించిందన్నారు. అయితే ఈ అంశంపై ఎలాంటి ఒత్తిళ్లకు పాక్ తలొగ్గదన్నారు.
అసాధారణ చర్యలకు వెనుకాడం
కుల్భూషణ్ జాదవ్కు పాక్ సైనిక కోర్టు రహస్యంగా ఉరిశిక్ష విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాదవ్కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించింది. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చెప్పింది.
చంపేసిందా?
కుల్ భూషణ్ జాదవ్ అసలు బతికి ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అనుమానాన్ని బీజేపీ ఎంపీ, హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్ కె సింగ్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు.
కుల్ భూషణ్ జాదవ్ను పాక్ చిత్రహింసలు పెట్టి చంపేసి ఉండొచ్చన్నారు. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఉరిశిక్ష అంటూ పాకిస్థాన్ కట్టుకథ అల్లుతోందని ఆయన ఆరోపించారు. అలా జరిగి ఉండకపోతే 13సార్లు భారత్ చేసిన విజ్ఞప్తిని పాక్ పరిగణనలోకి తీసుకునేదన్నారు.
ఆయనను చిత్రహింసలు పెట్టి చంపేశారు కాబట్టే కుల్ భూషణ్ జాదవ్ను కలుసుకునేందుకు భారత రాయబార కార్యాలయానికి పాక్ అనుమతి ఇవ్వడం లేదన్నారు. భారత్ విజ్ఞప్తిని పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం చూస్తుంటే కుల్ భూషణ్ జాదవ్ ఇక లేరనే అభిప్రాయం దృఢపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఆయన బతికి ఉన్నాడా? లేదా? అన్నది నిర్ధారించేందుకు భారత రాయబార కార్యాలయానికి అనుమతి ఇవ్వాలంటూ మరోసారి గట్టిగా పాక్ను భారత ప్రభుత్వం డిమాండ్ చేయాలన్నారు.
ఆ పని వెంటనే చేయాలని కేంద్రానికి సూచించారు. లేని పక్షంలో కుల్ భూషణ్ జాదవ్ను ఉరి తీసేసామంటూ పాకిస్థాన్ రేపే ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.