భారత్ 2028 నాటికి చైనా జనాభాను మించిపోతుంది
న్యూఢిల్లీ: భారత దేశ జనాభా 2028 నాటికి చైనా దేశాన్ని మించిపోతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత దేశంలో పెరుగుతున్న జననాల రేటును పరిశీలిస్తే మన దేశ జనాభా చైనాను మించిపోతుందని చెప్పారు. 2012 జనాభా లెక్కల ప్రకారం జననాల రేటు ఆధారంగా పరిశీలిస్తే 2028 నాటికి చైనా కంటే అధికమవుతుందని చెప్పారు.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. చైనాలో జననాల రేటు కంటే భారత దేశంలో జననాల రేటు ఎక్కువగా ఉందని చెప్పారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రభావవంతంగా లేవని చెప్పారు.
కాగా, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నదీ తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడంటూ గతంలో ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించడం సర్వత్రా విస్మయాన్ని కలిగించింది.
దావూద్ను అప్పగించాలంటూ పాకిస్తాన్కు గతంలో అనేకసార్లు భారత్ విజ్ఞప్తి చేసింది. దావూద్ అప్పగింతకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రక్రియ మొదలుకాలేదని, ఆచూకీ తెలిసిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపడుతామని హోమ్శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.