అమెరికాలో భారత మహిళకు 30 ఏళ్ల జైలు, నిరసనలు కూడా
వాషింగ్టన్: భ్రూణహత్య కేసులో భారతీయురాలికి అమెరికా న్యాయస్థానం ముప్పై ఏళ్ల జైలు శిక్ష విధించింది. గర్భస్థ శిశువు పట్ల అమానుషంగా ప్రవర్తించడం, రహస్యాలు దాచిపెట్టడం వంటి అభియోగాలకింద శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష విధించబడిన ఆమె పేరు పూర్వీ పటేల్.
కాగా, 30 ఏళ్ల జైలు శిక్షలో 20 ఏళ్లు ఆమె కారాగారంలో గడపాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. మరో 10 ఏళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. అయితే ఆమెపై ఐదేళ్లపాటు నిషేధం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. 2013 జులై నెలలో పూర్వి పటేల్ తీవ్ర రక్తస్రావంతో అమెరికాలోని ఓ ఆస్పత్రికి వచ్చారు.
తాను గర్భవతిని కానని వైద్యులకు చెప్పారు. కానీ, ఆమె బలవంతంగా గర్భాన్ని తొలగించుకున్నట్లు విచారణలో తేలింది. పిండాన్ని చెత్తబుట్టలో పడేసి, చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు తెలిపాయి. కేసు విచారించిన న్యాయస్థానం ఆమెకు శిక్షను ఖరారు చేసింది.
మరోవైపు, ఎలాంటి నేర చరిత్ర లేని యువతికి కోర్టు కఠినమైన శిక్ష విధించిందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులో ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా, ఆమె ఏమీ చెప్పుకోలేదని చెబుతున్నారు. పూర్వీ కుటుంబీకులు భారత్ నుండి వచ్చి గ్రాంగర్, ఇండియానాలో సెటిల్ అయ్యారు.