శ్రీలంకలో విశాఖ జంట అనుమానాస్పద మృతి, బంధువులకు సమాచారం
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో ఓ భారతీయ జంట అనుమానాస్పద స్ధితిలో మృతి చెందడం శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోలంబో మెట్రో పాలిటన్ ఏరియాలోని వెల్లవాట్ట ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ గదిలో 30 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళ మృతదేహాలను గుర్తించారు.
వీరు భారత్ నుంచి మార్చి 27న శ్రీలంకకు వచ్చి హోటల్లో బస చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి వారిద్దరూ గది నుంచి బయటికి రాకపోడవంతో అనుమానం వచ్చి హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారమిచ్చినట్లు స్ధానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
పోలీసులు వచ్చి హోటల్ గది తలుపు తెరవడంతో వారిద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. విషయం తెలుసుకున్న విశాఖ పోలీసులు మృతుల బంధువులకు సమాచారమిచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితులలో మరణించారని తెలిపారు.
వీరి మృతిని అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేసిన కొలంబో పోలీసులు, విశాఖ పోలీసులకు సమాచారమిచ్చారు. మృతులు విశాఖలోని గాజువాక వాసులుగా గుర్తించినట్లు కొలంబో పోలీసులు, విశాఖ పోలీసులకు తెలిపారు.