పాకిస్తాన్ అధికారికి దండంతో సరి: వినూత్నంగా నిరసన తెలిపిన ఉన్నతాధికారి
హేగ్: గూఢచారిగా ముద్రపడి ప్రస్తుతం పాకిస్తాన్ లో కారాగార శిక్షను అనుభవిస్తున్న వైమానిక దళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసు విచారణ సందర్భంగా నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు హాజరైన పాకిస్తాన్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ తో మన విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్.. చేతులు కలపడానికి నిరాకరించారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. దీనికి బదులుగా మనదేశ సంప్రదాయం ఉట్టిపడేలా ముకుళిత హస్తాలతో నమస్కారం చేశారు. చిరునవ్వుతో అన్వర్ మన్సూర్ ఇవ్వబోయిన షేక్ హ్యాండ్ ను తిరస్కరించారు.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి తరువాత రెండు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొంది. పుల్వామా దాడికి పాకిస్తానే కారణమంటూ మనదేశ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలని గళమెత్తారు. అదే సమయంలో- పాకిస్తాన్ జైలులో ఉన్న కులభూషణ్ జాదవ్ కేసు విచారణ కూడా అంతర్జాతీయ న్యాయస్థానం సమక్షానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
షేక్ హ్యాండ్ తిరస్కరణ..నమస్కారంతో సరి
సాధారణంగా ఇద్దరు ఉన్నతాధికారులు ఎదురుపడ్డప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సర్వ సాధారణం. రెండు దేశాలకు చెందిన అధికారులు ఎదురు పడ్డప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో దీనికి భిన్నమైన సన్నివేశం చోటు చేసుకుంది. అప్పటిదాకా తనకు ఎదురుపడ్డ మనదేశానికి చెందిన అధికారులు, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రతినిధులకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు దీపక్ మిట్టల్. తాను కూర్చున్న టేబుల్ వద్దకు వచ్చిన ప్రతి పాకిస్తానేతర అధికారులనూ ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు.
కొద్దిసేపటికి అన్వర్ మన్సూర్ ఆయన వద్దకు చేరుకున్నారు. చిరునవ్వుతో పలకిరిస్తూ షేక్ హ్యాండ్ కోసం అన్వర్ మన్సూర్ తన కుడి చేతిని ముందుకు చాచారు. దీపక్ మిట్టల్ ఆయన చేతిని అందుకోలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి ప్రతిగా.. దీపక్ మిట్టల్ చేతులు జోడించి, నమస్కారం పెట్టారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న అన్వర్ మన్సూర్ వెంటనే తేరుకున్నారు. తానూ చిరునవ్వులు చిందిస్తూ, అక్కడి నుంచి ముందుకు కదిలి వెళ్లారు.
పుల్వామాపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా దీపక్ మిట్టల్ ఇలా విభిన్నంగా తన నిరసన తెలియజేశారని అక్కడి అధికారులు వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి తరువాత పాకిస్తాన్ తో దౌత్యపర, విధానపరమైన సంబంధాలకు బీటలు వారాయి. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు యుద్ధానికి దిగుదామా? అని ఉవ్విళ్లూరుతున్నాయి త్రివిధ దళాలు. సరిగ్గా అదే సమయంలో కులభూషణ్ జాదవ్ విడుదలకు సంబంధించిన కేసు కూడా అంతర్జాతీయ న్యాయస్థానం సమక్షానికి విచారణకు రావడం ఉత్కంఠత రేపింది.