గొంతులు కోయడంపై నెట్లో సమాచారం: ఫ్యామిలిని మట్టుబెట్టాడు
లండన్: కుటుంబ సభ్యులను అంతం చేసి ఆత్మహత్య చేసుకున్న ప్రవాస భారతీయుడు (ఎన్నారై) జితేంద్ర లాడ్ గురించి లండన్ పోలీసు అధికారులు పలు ఆసక్తికరమైన సమాచారం చేకరించారు. అతను అనేక విధాలుగా ఆలోచించి పక్కా ప్లాన్ తో కుటుంబ సభ్యులను అంతం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.
ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ ప్రాంతంలో ఎన్ఆర్ఐ జితేంద్ర లాడ్ (49), ఆయన భార్య దక్షాబెన్ (44), కుమార్తెలు త్రిష (19), నిష (16) నివాసం ఉండేవారు. బ్రాడ్ ఫోర్డ్ కౌన్సిల్ లో జితేంద్ర లాడ్, ఆయన భార్య దక్షాబెన్ ఐటి మేనేజర్లుగా ఉద్యోగం చేసేవారు.
గత సంవత్సరం అక్టోబర్ 25వ తేదిన వీరి ఇంటిలో హత్యకు గురైనారు. విషయం తెలుసుకున్న బ్రాడ్ ఫోర్డ్ కౌన్సిల్ లీడర్ డేవిడ్ గ్రీన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దంపతులు ఇద్దరు చక్కగా పని చేసే వారని, వారికి కౌన్సిల్ లో మంచి పేరు ఉందని డేవిడ్ గ్రీన్ చెప్పారు.
బ్రాడ్ ఫోర్డ్ డిటెక్టీవ్ సూపరెండెంట్ సిమోన్ అటిక్సన్ కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో పలు విషయాలు వెలుగు చూశాయని పోలీసు అధికారులు అంటున్నారు. జితేంద్ర లాడ్ చాల కాలం నుండి డిప్రెషన్ లో ఉన్నారని దర్యాప్తులో వెలుగు చూసింది.
కత్తులతో గొంతులు కోయడం ఎలా అని అతను అక్టోబర్ మొదటి వారం నుండి ఇంటర్నెట్ లో వివరాలు సేకరించాడని పోలీసులు చెప్పారు. తరువాత భార్య దక్షాబెన్, కుమార్తెలు త్రిష, నిషలను కత్తులతో హత్య చేసి తరువాత జితేంద్ర లాడ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.