భారత అధికారులు మొండివాళ్లు: చైనా మీడియా అక్కసు
భారత్పై చైనా మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. భారత అధికారులను మొండివాళ్లుగా, నిరాశావాదులుగా గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
బీజింగ్: చైనా అధికారిక మీడియా భారత విదేశీ వ్యవహారాల అధికారులను మొండి వాళ్లుగా, నిరాశావాదులుగా అభివర్ణిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్పై తన అక్కసును వెళ్లగక్కింది.గత వారంలో జరిగిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ వారు మాత్రం అంతేనంటూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సారథ్యంలో నడుస్తున్న వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసింది.
చైనా మేధావులు, విమర్శకుల్లో అత్యధికులు చర్చలను సానుకూలంగా స్వీకరించారని, ప్రస్తుత వాతావరణాన్ని మార్చి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో నూతన శకం ఆరంభమవుతుందని భావించారని, అయితే భారత అధికారులు మాత్రం అలవికాని కోరికలను ప్రస్తావిస్తూ మొండిగా నిరాశావహ దృక్పథంతో వ్యవహరించారని వ్యాఖ్యానించింది.
ఎన్ఎస్జీలో సభ్యుత్వం గురించి, జేఈఎమ్ చీఫ్ మసూద్ అజర్ను ఐరాస నిషేధిత ఉగ్రవాదుల జాబితాలోకి చేర్చడం వంటి ప్రతిపాదనలు చేశారని గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య మారుతున్న సమీకరణాలను అర్థం చేసుకోవాలంటే ఇలాంటి సంక్లిష్టమైన తేడాలను అర్థం చేసుకోవడమే కీలకమని అభిప్రాయపడింది.
అమెరికా సహా ప్రపంచంలోని అత్యధిక దేశాలు భారత్ ఆర్థిక వృద్ధికి ఉపకరించే అణు సరఫరా కూటమి (ఎన్ఎస్జీ) సభ్యుత్వానికి సుముఖత తెలిపాయి. అయితే, చైనా మాత్రం మోకాలడ్డుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అదలావుంటే, మసూద్ అజర్ను కరడుగట్టిన తీవ్రవాదిగా అంతర్జాతీయ సమాజం మొత్తం వేలెత్తి చూపిస్తున్నప్పటికీ ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా వీటో అధికారంతో అడ్డుకున్నదీ చైనాయే కావడం విశేషం.
గత గురువారం విదేశాంగ కార్యదర్శి జయశంకర్ చైనా విదేశాంగ కార్యనిర్వాహక సహాయమంత్రి జాంగ్ యేసూయ్తో సమావేశమయ్యారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం ఇదే తొలిసారి.