ట్రంప్ ను ఓడించిన ముగ్గురు భారతీయ ముస్లింలు..! ఒకేరోజు ట్రిపుల్ షాక్..!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇవాళ భారీ షాకులు తగిలాయి. రిపబ్లికన్ల ఆధిపత్యానికి గండికొడుతూ ఇవాళ మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ మూలాలున్న ముస్లింలు ట్రంప్ కు షాకిచ్చారు. దీంతో గతేడాది అధ్యక్ష ఎన్నికల ఓటమి తర్వాత డెమోక్రాట్లకు తిరిగి ఊపిరిపోసినట్లయింది. అంతే కాదు భారతీయుల్ని టార్గెట్ చేస్తున్న ట్రంప్ కు స్వదేశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సిటీ, సిన్సినాటీ, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన ముస్లిం అభ్యర్ధులు ఘన విజయాలు నమోదు చేసుకున్నారు. వీరిని ఓడించేందుకు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. ఇందులో న్యూయార్క్ సిటీ నుంచి జోహ్రాన్ మమ్దానీ, సిన్సినాటి నుంచి ఆఫ్తాబ్ పురేవాల్, వర్జీనియానుంచి గజాలా ఫిర్దౌస్ హష్మీ విజయాలు సాధించారు.

న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో గెలిచిన జోహ్రాన్ మమ్దానీ, భారతీయ-అమెరికన్ తల్లి మీరా నాయర్కు జన్మించగా, హష్మీ భారతదేశంలో జన్మించారు. పురేవాల్ ఒహియోలో పంజాబీ తండ్రి, టిబెటన్ శరణార్థి తల్లికి జన్మించారు. అలాగే మమ్దానీ తల్లి మీరా నాయర్ ప్రముఖ భారతీయ దర్శకురాలు. అతని తండ్రికి కూడా గుజరాత్తో పూర్వీకుల సంబంధాలు ఉన్నాయి. జోహ్రాన్ తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్.

వాస్తవానికి ఈ మూడు చోట్లా అధ్యక్షుడు ట్రంప్ ఏమీ వ్యక్తిగతంగా పోటీ చేయలేదు. కానీ ఆయన పార్టీ అభ్యర్ధులుగా రిపబ్లికన్లు బరిలో నిలిచారు. వీరిని గెలిపించుకోవడంలో ట్రంప్ విఫలమయ్యారు. న్యూయార్క్లో ట్రంప్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు మద్దతిచ్చారు. మమ్దానీ గెలిస్తే సమాఖ్య నిధులను నిలిపివేస్తామని బెదిరించారు. అయినా ఆయనకే జనం ఓటేశారు. వర్జీనియాలో హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. సిన్సినాటీలో మేయర్ గా పురేవాల్ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించారు.












Click it and Unblock the Notifications