ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక
జకార్తా: ఇండోనేషియాలోని నైరుతి భాగంలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రాకు 800 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో భూకంపం సంభవించినట్లు అధికారులు ప్రకటించారు. భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 7.9గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తతో సునామీ హెచ్చరికలు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ సుమత్రా, ఉత్తర సుమత్రా, అచె తదితర ప్రాంతాలకు ఈ సునామీ హెచ్చరిక జారీ చేశారు.
ఇండోనేషియాకు నైరుతి దిశగా ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్త తెలిపింది. పడాంగ్ నగరానికి 808 కిలోమీటర్ల నైరుతి దిశలో భూకంప కేంద్రం ఉందని, ఇది భూమికి 10కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పింది.
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతానికి కూడా సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియా పశ్చిమతీరంలోని మెంటవాయ్ ప్రాంతంలో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. రేడియో ద్వారా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం ఏమి లేదని ఇండోనేషియా అధికారులు తెలిపారు.
కాగా, ఇండోనేషియా పసిఫిక్ రింగ్లో వుంది. దీని ప్రభావంతో భూపలకల రాపిడితో ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం వుంది. అయితే తాజాగా ఏర్పడిన భూకంప ప్రభావంతో ప్రాణనష్టం, ఆస్తినష్టంపై సమాచారం అందలేదు. భారత్కు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, 2004లో వచ్చిన సునామీలో ఇండోనేషియాలోని సుమత్రా, అచె ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.