Viral Video: పేలిన అగ్నిపర్వతం: బూడిద వర్షం: నాలుగు కిలోమీటర్ల ఎత్తు..భయంభయంగా
జకర్తా: ఇండోనేషియాలో క్రియాశీలకంగా ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం పేలింది. ఇండోనేషియా కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇది పేలిపోయింది. గత ఏడాది ఆగస్టు నుంచి నివురుగప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న మౌంట్ సైనాబంగ్ (Mount Sinabung) అగ్నిపర్వతం పేలుడు తీవత్ర కొన్ని కిలోమీటర్ల మేర ప్రభావాన్ని చూపింది. 13 సార్లు బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్మంది. రెండోసారి పేలుడు సంభవించిన సమయంలో ఏకంగా నాలుగు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద, రాళ్లు ఎగిసిపడ్డాయి. ఫలితంగా- సమీప గ్రామాల్లో బూడిద.. వర్షంలా కురిసింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా వార్తలు అందలేదు.
120 వరకు క్రియాశీలక అగ్నిపర్వతాలు..
క్రియాశీలక అగ్నిపర్వతాలకు మారుపేరు.. ఇండోనేషియాలో. 120 వరకు అగ్నిపర్వతాలు ఇక్కడ చురుగ్గా ఉంటోన్నాయి. తరచూ పేలుతుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల జాబితాలో ఇదీ ఒకటి. వాటిల్లో ఎత్తయినదిగా భావించే సైనాబంగ్ అగ్నిపర్వతం ఈ తెల్లవారు జామున పేలిపోయింది. గత ఏడాది ఆగస్టు నుంచీ ఇదీ అత్యంత క్రియాశీలకంగా ఉంటూ వస్తోంది. తరచూ చిన్నచిన్న పేలుళ్లు ఇందులో చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ వారం రోజుల్లో వాటి తీవత్ర మరింత పెరిగింది. తాజాగా- ఈ అగ్నిపర్వతం పూర్తిస్థాయిలో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పుట్టగొడుగుల్లా కమ్మేసిన బూడిద..
నార్త్ సుమత్ర ప్రావిన్స్లో ఉన్న ఈ అగ్నిపర్వతం పేలిన వెంటనే ఆకాశంలో పుట్టగొడుగులా బూడిద కమ్మేసింది. రాళ్లు, రప్పలు ఎగిరిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లోని చెట్లు భగ్గుమంటూ మండిపోయాయి. పేలుడు సంభవించిన వెంటనే 16 వేల 400 అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దశాబ్దకాలంలో సైనాబంగ్ అగ్నిపర్వతం మూడుసార్లు పేలిందంటే.. అదెంత చురుగ్గా ఉంటోందనేది అర్థం చేసుకోవచ్చు. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఇది మరోసారి పేలే అవకాశాలు ఉన్నట్లు ఇండోనేషియా భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు.
దశాబ్దంలో నాలుగోసారి..
2010లో సైనాబంగ్ అగ్నిపర్వతం పేలిపోయినప్పుడు ఇద్దరు మరణించారు. 2014లో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 2016లో మూడోసారి పేలిన సమయంలో ఏడుమంది మృత్యువాత పడ్డారు. తాజాగా పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించినట్టు గానీ, బూడిద, రాళ్లు ఎగిరిపడటం వల్ల నివాసాలు ద్వంసమైనట్లు గానీ ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదు. సైనాబంగ్ అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలకంగా ఉంటుండటంతో స్థానిక ప్రభుత్వం, దాని చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయించింది. సుమారు మూడువేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. సుమారు 2,600 మీటర్ల ఎత్తు (8,530 అడుగులు) ఉన్న మౌంట్ సైనాబంగ్ అగ్నిపర్వతం పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్నాయి. వైరల్గా మారాయి.
Gunung Sinabung pagi Ini. pic.twitter.com/07ZDEanZaI
— Gading (@GadingGinting) March 2, 2021