మరోసారి జల వివాదం: నీటిని ఆపితే యుద్ధమేనని పాక్ వార్నింగ్!
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గతేడాది కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ తాజాగా స్పందించింది. పాకిస్థాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా ఆదివారం ఓ వార్తా ఛానెలతో మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్కు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ ఒప్పందం అమల్లో ఉందని.. ఏ ఒక్క దేశం దీనిని ఏకపక్షంగా ముగించలేదని ఆయన వాదించారు. ఆయన తన ప్రకటనలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ ఒప్పంద చట్టాల్లో 'సస్పెన్షన్' (నిలిపివేత) అనే పదానికి గుర్తింపు లేదని, ఇది భారత్ సృష్టించుకున్న పదం అని ఆయన విమర్శించారు. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్ష చర్యలను అడ్డుకునేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారని, భారత్ దీనిని రద్దు చేయలేదని పాక్ విశ్వసిస్తోందని తెలిపారు.

మరోసారి యుద్ధ హెచ్చరిక
పాకిస్థాన్కు అందాల్సిన నీటి వాటాను నిలిపివేయడం లేదా తగ్గించడం వంటి చర్యలను 'యుద్ధ చర్య'గా పరిగణిస్తామని మెహర్ అలీ షా హెచ్చరించారు. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదుల నుంచి సహజ సిద్ధంగా వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి.. భారత్ నిర్ణయం
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. గతేడాది ఏప్రిల్లో కశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ పాకిస్థాన్పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, పాక్కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ అంశాన్ని పాకిస్థాన్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది.పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా పాకిస్థాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరికి కట్టుబడి ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ జల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications