బ్రిటన్ ప్రధాని బోరిస్కు పదవి గండం.. రేసులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏడాదిన్నర క్రితం చేసిన తప్పుడు ఇప్పుడు ఆయన పదవికే గండం తెచ్చిపెడుతోంది. ఆయనకు ఇక కాలం దగ్గరపడిందంటూ లండన్ మీడియా కోడై కూస్తోంది. ఒకవైపు కరోనా మహమ్మారి విలయతాండం చేస్తుంటే బోరిస్ తన అధికారిక నివాసంలో తన సహచరులతో కలిసి మందు పార్టీలు చేసుకోవడం ఆయన కుర్చికే ఇప్పుడు పెద్ద ఎసరు తెచ్చిపెట్టేలా తయారైంది. మద్యం పార్టీ వ్యవహారాన్ని బోరిస్ స్వయంగా ఆంగీకరించడంతో ఆయన ఇక ప్రధాని పదవిలో కొనసాగడానికి అర్హతలేదంటూ ప్రతిపక్ష పార్టీతో సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తదుపరి ప్రధాని ఎవరన్న చర్చలో ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు వినిపిస్తోంది.
.బ్రిటన్ ప్రధాని బోరిస్ మందు పార్టీ.. పదవి ఎసరు..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏడాదిన్నర క్రితం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ '10 డౌన్ స్ట్రీట్ 'లోని తన అధికారిక నివాసంలో తన సహచరులతో కలిసి మందు పార్టీలు నిర్వహించారు. ఇప్పడుదనే ఆయన మెడకు చుట్టుకుంది. ఏకంగా తన ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. దేశంలో కరోనాతో ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతుంటే .. నిబంధనలను ఉల్లంఘించి ఒక బాధ్యత గల ప్రధాని మద్యం విందులు చేసుకోవడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. బోరిస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీయే కాకుండా .. సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. దీంతో బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో క్షమాపణలు చెప్పారు.
ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ..
బోరిస్ క్షమాపణలు చెప్పినా ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన వారసుడు ఎవరనే దానిపై ప్రధానం చర్చ జరుగుతుంది. తదుపరి ప్రధాని రేసులో ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు వినిపిస్తోంది. ఈయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి స్వయానా అల్లుడు. ప్రస్తుతం రిషి బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బోరిస్ జాన్సన్ దిగువసభలో క్షమాపణ చెబుతున్న సమయంలో రిషి అక్కడ లేకపోవడంపై ఆ దేశ మీడియా అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రధాని బోరిస్పై ఆరోపణల నుంచి దూరంగా ఉండాలన్న ఉద్దేశంలో దిగువ సభకు రిషి హాజరు కాలేదని అక్కడి మీడియా కథనాలు రాశాయి..
బోరిస్ క్షమాపణలను సమర్థించిన రిషి
అయితే.. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని రిషి సునక్ ట్విట్టర్ లో తెలిపారు. ప్రధాని బోరిస్ క్షమాపణలను సమర్థించారు. ఈ వివాదంపై విచారణ ముగిసేవరకు సహనంతో ఉండాలన్న ఆయనకు మద్దతు ఇచ్చారు. ఉద్యోగ కల్పనపై వివిధ వర్గాలతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే సభకు హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు. అయితే రిషి స్పందనపై కూడా అక్కడి మీడియా విభిన్నంగా కథనాలు ప్రసారం చేశాయి.
రిషి సునక్కు పెరుగుతున్న మద్దతు
మరోవైపు ఇలాంటి ఊహాగానాలపై బ్రిటన్లోని 'బెట్ఫెయిర్' అనే ఆన్లైన్ సంస్థ బెట్టింగ్ నిర్వహిస్తుంటుంది. బోరిస్ జాన్సన్ తప్పుకుంటే దేశ ప్రధానిగా రేసులో రిషి సునక్కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు ఆసంస్థ పేర్కొంది. తదుపరి స్థానంలో విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ తో పాటు భారతి సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయని తెలిపింది. అటు ఇక వివిధ బెట్టింగులను పోల్చిచూసే 'ఆడ్స్చెకర్' సైతం బోరిస్ వారసుల రేసులో రిషి సునక్ ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.