నేరస్తురాలి ఒక కన్ను గుడ్డిదయ్యేలా చేయండి: సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు
ఓ మహిళపై యాసిడ్ పోసి ఆమె కంటి చూపు పోవడానికి కారణమైన కేసులో.. నేరస్తురాలికి కూడా ఒక కన్ను గుడ్డిదయ్యేలా చేయమని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.
అంకారా: ఓ మహిళపై యాసిడ్ పోసి ఆమె కంటి చూపు పోవడానికి కారణమైన కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. నేరస్తురాలికి కూడా కన్ను గుడ్డిదయ్యేలా చేయమని ఆదేశిస్తూ.. ఇందుకు ఇస్లామిక్ షరియా చట్టాన్ని ఉటంకించింది.
కాకపోతే ఈ రకమైన తీర్పును ఇచ్చింది మన సుప్రీంకోర్టు కాదు, ఈ ఘటన జరిగింది కూడా మన దేశంలో కాదు.. ఇరాన్ లో. వివరాల్లోకి వెళ్తే... ఇరాన్ లోని డెహ్డష్ట్ నగరంలో రెండేళ్ల క్రితం ఓ మహిళ మరో మహిళపై యాసిడ్ పోసింది.
ఈ ఘాతుక చర్య కారణంగా బాధితురాలు సీమాకి కంటిచూపు పోయింది. ఆ తరువాత కూడా ఇరాన్ లో ఎంతోమందిపై ఇలాంటి యాసిడ్ దాడులు జరిగాయి. కానీ సీమా కేసులో గురువారం ఇరాన్ సుప్రీం కోర్టు ఇస్లామిక్ షరియా చట్టాన్ని పరిగణనలోనికి తీసుకుని సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో నేరస్తురాలికి ఒక కన్ను గుడ్డిదయ్యేలా చేయమంటూ ఆదేశించింది. తీర్పు సందర్భంగా షరియా చట్టాన్నిఉటంకిస్తూ.. ''కంటికి కన్ను అని ఈ చట్టం చెబుతోంది..'' అని పేర్కొంది.
దీంతోపాటు నేరస్తురాలికి ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తూ.. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. తస్నీమ్ అనే వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ లో షరియా చట్టం అమలులోకి వచ్చింది. శారీరక గాయాలు ఏర్పడిన కేసుల్లో ప్రతీకరా శిక్షలకు ఈ చట్టం అనుమతిస్తోంది. అయితే బాధితులు, వారి కుటుంబ సభ్యలు దయ చూపి.. ఈ శిక్ష అమలు కాకుండా చేయవచ్చని కూడా షరియా చట్టం చెబుతోంది.