హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో తగ్గిన ఇరాన్ సర్కారు: ‘మోరాలిటీ పోలీసు’ రద్దు
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న హిజాబ్ వ్యవతిరేక ఆందోళనలతో ఇరాన్ ప్రభుత్వం వివాదాస్పద మోరాలిటీ(నైతిక) పోలీస్ విభాగాన్ని రద్దు చేసింది. అమీని మృతికి కారణమవడంతో ఇరాన్లో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నైతిక పోలీసు విభాగానికి.. న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. దాన్ని రద్దు చేశాం అని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంతజేరి ప్రకటించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. హిజాబ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థులు కలిసి సమాలోచనలు జరుపుతున్నాయంటూ అటార్నీ జనరల్ పేర్కొన్న మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
ఈ ఏడాది సెంబర్ నెలలో అమీని అనే యువతి హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారి కస్టడీలో తీవ్రంగా గాయపడిన అమినీ మరణించింది. దీంతో అమీనిని పోలీసులే కొట్టి చంపారంటూ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలు రేకెత్తాయి.
సెప్టెంబర్ 17న మొదలైన ఈ నిరసనలు రాజధాని టెహ్రాన్ తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలకు వ్యాపించాయి. రెండు నెలలకుపైగా ఇప్పటికీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఈ నిరసనలు తీవ్రంగా అణిచివేశాయి. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చిన మహిళలు హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వం దిగివచ్చి నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది.