ఖమేనీ వారసుడొచ్చాడు- ఇన్నాళ్లూ తెర వెనుక ఉండి ఇరాన్ ను నడిపించాడు..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చింది.
దీని తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సుప్రీమ్ లీడర్ నియమితులయ్యారు అప్పుడే. ఖమేనీ వారసుడు ఖరారయ్యారు. ఇరాన్ తదుపరి సుప్రీమ్ గా మొజ్తబా ఖమేనీ అపాయింట్ అయ్యారు. ఖమేనీ పెద్ద కుమారుడు మొజ్తాబా. నేడు ఆయన ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన దేశ నాయకత్వ పగ్గాలు మొజ్తాబా చేతికి అధికారికంగా అప్పగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.

మోజ్తబా ఖమేనీ 1969లో మషద్ లో జన్మించారు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో 'రివల్యూషనరీ గార్డ్'లో పనిచేశారు. తండ్రికి కుడిభుజంగా వ్యవహరించారు. అనేక విషయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పారనే పేరుంది. పాలనపరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో మొజ్తబా ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతారు. రివల్యూషనరీ గార్డ్ తర్వాత ఎప్పుడూ కూడా పెద్దగా తెరమీదికి రాలేదు.
అలాగే ప్రభుత్వ పదవిలోనూ పని చేసిన అనుభవం ఆయనకు లేదు. అయినప్పటికీ- మోజ్తబా తన తండ్రికి విశ్వసనీయ సలహాదారుగా కొనసాగారు. సైన్యం, పారామిలిటరీ దళాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని ఇరాన్ మీడియా చెబుతోంది. 2009లో జరిగిన నిరసన ప్రదర్శనల్లోనూ మోజ్తబా ఖమేనీ పేరు వార్తల్లో నిలిచింది. ఆందోళనలను కఠినంగా అణచివేయడంలో ఆయన భూమిక పోషించారనే ఆరోపణలు అప్పట్లో ఆయనపై వెల్లువెత్తాయి.
ఇప్పుడు ఆయన సుప్రీం లీడర్గా మారడంతో దేశంలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. 1979 విప్లవం వారసత్వ అధికారాన్ని వ్యతిరేకించింది. అందువల్ల, కొందరు ఆయన ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం, సైనిక మద్దతు ఆయనకు బలాన్ని అందిస్తుండటంతో, మోజ్తబా ఖమేనీని శక్తివంతమైన నాయకుడిగా పరిగణిస్తున్నారు.












Click it and Unblock the Notifications