పాక్ ఉగ్రవాదుల చేతికి అణ్వస్త్రాలు?
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది.

ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. రాత్రి 10 గంటలకు ఆయన తెర మీదికి రానున్నారు. రాజధాని వాషింగ్టన్ లో గల తన అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి టీవీ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇరాన్ లో చేపట్టిన సైనిక చర్య గురించి దేశ ప్రజలకు వివరించనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి సంబంధించిన అంశాలపై మాట్లాడనున్నారు. ప్రత్యేకించి- ఇరాన్ అణు స్థావరాలు, యురేనియం శుద్ధి కేంద్రాలపైనే దాడులు చేపట్టడానికి గల కారణాలను వెల్లడించనున్నారు.
ఈ దాడుల నేపథ్యంలో వైట్ హౌస్ లో తాజాగా విలేకరులతో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. తాము చేపట్టిన సైనిక చర్య తర్వాత కూడా ఇరాన్.. వెనక్కి తగ్గకపోయినా, ఆ రీజియన్ లో శాంతియుత పరిస్థితులు నెలకొనకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దాడులు తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు.
ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నంబర్ వన్ దేశం నుండి వచ్చే అణు ముప్పును ఆపడం కోసమే తాజా దాడులు చేయాల్సి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులు అద్భుతమైనవిగా అభివర్ణించారు. తమ వైమానిక బలగాలు సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల చేతికి ఇరాన్ నుంచి అణ్వస్త్రాలు అందుతున్నాయని పరోక్షంగా వివరించారు.
ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలకమైన అణు వనరులు, న్యూక్లియర్ స్థావరాలు, వాటికి కల్పించే మౌలిక సదుపాయాలు తుడుచుకుపోయాయని ట్రంప్ అన్నారు. మధ్య ఆసియా దేశాలకు అతి పెద్ద శత్రువుగా తయారైన ఇరాన్ లో ఇప్పుడు శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని.. లేకపోతే, భవిష్యత్ దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ప్రతిఘటనకు ఇరాన్ ప్రయత్నిస్తే తగిన మూల్యం తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. అవి ఎక్కువ కాలం పాటు కొనసాగబోవనీ వ్యాఖ్యానించారు. ఇరాన్ లో శాంతి నెలకొనాలా? లేక విషాదమా? అనేది ఆ దేశం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య సాగిన ఘర్షణల కంటే అమెరికా చేపట్టిన తాజా దాడులే అత్యంత ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో అత్యంత క్లిష్టమైనది, ప్రాణాంతకమైనదీ ఇదేనని చెప్పారు. శాంతి నెలకొనకపోతే ఇరాన్ ను వెంటాడుతామని అన్నారు.












Click it and Unblock the Notifications