MUST Read:మెదడుపైన కూడా ప్రభావం చూపే కరోనావైరస్.. న్యూరాలజిస్టులు ఏం చెబుతున్నారు..?
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఇప్పుడు ప్రపంచమంతా కరోనావైరస్ చర్చ తప్ప మరొకటి లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఈ మాయదారి రోగం వ్యాప్తి చెందడంలో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటి వరకు కరోనావైరస్ కేవలం శ్వాసకోశ పైనే ప్రతాపం చూపేది. తాజాగా పలు కేసుల్లో అది మెదడుపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోందనే వార్తలు వస్తున్నాయి.
మెదడుపై కరోనా ఎఫెక్ట్..?
ప్రపంచాన్ని కబళించివేస్తోన్న కరోనావైరస్ లక్షణాలు పొడిదగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అనే మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ మహమ్మారి మనిషి మెదడుపై కూడా ప్రభావం చూపుతోందని అమెరికా వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు రక్తంలో ఆక్సిజెన్ లెవెల్స్ను కూడా తగ్గించి వేస్తోందని చెబుతున్నారు. ఇక కొందరి పేషెంట్లలో ఊపిరితిత్తుల పనితీరులో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందని వైద్యులు చెబుతున్నారు.
కొందరు పేషెంట్లు తాము ఎక్కడున్నారో అనేది కూడా మరిచిపోతున్నారని ఇది ఏ సంవత్సరం అనే విషయం కూడా వారికి గుర్తుండటం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కొత్త లక్షణాలు కనిపిస్తుండటంతో న్యూయార్క్ యూనివర్శిటీ లంగోన్ హాస్పిటల్లో న్యూరాలజిస్టుగా పనిచేస్తున్న జెన్నీఫర్ ఫ్రంటేరా ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూరాలజిస్టులు ఏమంటున్నారు..?
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.2 మిలియన్ మందికి సోకిన ఈ మహమ్మారి... ఇది శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేస్తుందని మాత్రమే చాలామందికి తెలుసని అన్నారు డాక్టర్ జెన్నీఫర్. ఇక కోవిడ్-19 సోకిన 214 మంది చైనా పేషెంట్లలో 36.4 శాతం మంది పేషంట్లలో మెదడు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించినట్లు జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిష్ చేసిన జర్నల్లో పేర్కొంది.
ఇందులో ముఖ్యంగా వాసన పసిగట్టకపోవడం, నరాల నొప్పి దగ్గర నుంచి గుండెపోటు లాంటి లక్షణాలు కనిపించాయని ఆ జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఇక మరో పేపర్ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ప్రకారం 58 మంది కరోనా వైరస్ పేషెంట్లు చాలా కన్ఫ్యూజ్డ్ పరిస్థితిలో కనిపించారని ఇదంతా మెదడు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే జరుగుతోందని గుర్తించినట్లు రాసుకొచ్చింది. ఇది కేవలం శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని ఇప్పటి వరకు అంతా భావించారని.. దీంతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గ్రహించాలని చెప్పారు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో న్యూరాలజీ డిపార్ట్మెంట్ అధిపతి ఆండ్రూ జోసెఫ్సన్.
నాడీ వ్యవస్థను కూడా ధ్వసం చేసే కరోనావైరస్
ఇక సార్స్ కోవిడ్ మెదడు, నాడీ వ్యవస్థలను కూడా నాశానం చేయగలదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర వైరస్లు మెదడుపై ఎలాంటి తీవ్రమైన ప్రభావం చూపగలవని చెబుతున్నారో చికిత్స చేయకుంటే కరోనావైరస్ కూడా మెదడుపై ప్రభావం చూపించగలదని చెబుతున్నారు. కరోనావైరస్ మెదడుపై రెండు విధాలుగా ప్రభావం చూపుతుందని మెఖేల్ టోలెడానో అనే న్యూరాలజిస్టు చెబుతున్నారు.
మెదడుపై సైటోకైన్ స్ట్రామ్ అనే అసాధర రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడం ద్వారా మెదడు వాపు వస్తుందని దీన్నే ఆటో ఇమ్యూన్ ఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారని చెప్పారు. ఇక రెండోది నేరుగా మెదడులోనే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.దీన్నే వైద్య పరిభాషలో వైరల్ ఎన్సెఫాలిటిస్ అని పిలుస్తామని చెప్పారు.
ఇది ఎలా జరుగుతుంది..?
బ్లడ్ బ్రెయిన్ బారియర్ అనేది మెదడుకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మెదడులోకి ప్రవేశించే ఇతర సూక్ష్మపదార్థాలను ఇది అడ్డుకుంటుంది. బ్లడ్ బ్రెయిన్ బారియర్ సరిగ్గా పనిచేయకపోతే సూక్ష్మపదార్థాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కరోనావైరస్ సాధారణ లక్షణాల్లో వాసన పసిగట్టకపోవడం కూడా ఒకటి. అయితే ముక్కు నేరుగా మెదడుకు కనెక్ట్ అయి ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది.
అయితే ఇది నిరూపితం కాలేదు. అంతేకాదు అనోస్మియాతో బాధపడే ప్రతి ఒక్కరిలో నరాల వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. ఇక ఇదంతా నిరూపితం కావాలంటే ముందుగా మెదడు ప్రధాన భాగం సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో వైరస్ ఉందని నిరూపించాల్సి ఉంది. అయితే ఇదంతా జపాన్కు చెందిన 24 ఏళ్ల వ్యక్తిలో కనుగొన్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిజీస్లో డ్యాక్యుమెంట్ చేశారు. ఆ వ్యక్తి చాలా గందరగోళంగాను ఆందోళనకరంగాను కనిపించాడంతో పాటు మూర్ఛ వ్యాధి కూడా వచ్చిందని అందులో పబ్లిష్ చేశారు. అంతేకాదు తన మెదడుపై వైరస్ ప్రభావం చూపిందని గుర్తించినట్లు ఆ జర్నల్లో పబ్లిష్ చేశారు.అయితే ఇప్పటి వరకు ఈ ఒక్క కేసులోనే ఇది గమనించడం జరిగిందని నిపుణులు చెప్పారు. స్పైనల్ ఫ్లూయిడ్లో వైరస్ ఉందనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. దీంతో సైంటిస్టులు కాస్త జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు.
Recommended Video