జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతి?
ఇస్లామాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) గత నెల 26వ తేదీన బాలాకోట్లోని జేఈఎం ఉగ్రవాద శిబిరం సహా పలుచోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 200 నుంచి 350 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే దాడిలో జేఈఎం చీఫ్ మసూద్ అజహర్ కూడా గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలుస్తోంది.
పాకిస్తాన్ మంత్రి మహమూద్ ఖురేషి ఓ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ.. మసూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని, అతని ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. అయితే మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడిలో మసూద్ అజహర్ గాయపడ్డాడని, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మసూద్ అజహర్ చనిపోయినట్లు మీడియాలో వార్తలు రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో చనిపోయినట్లుగా చెబుతున్నారు. మసూద్ అజహర్ మృతిపై మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మసూద్ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. కానీ ట్విట్టర్లో మసూద్ అజహర్ చనిపోయాడని బాగా ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉండగా, మసూద్ అజహర్ కొద్దికాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని కూడా వార్తలు వస్తున్నాయి. రావల్పిండిలోని ఆర్మీ ఆసుపత్రిలో అతను రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
పాక్ విదేశాంగ మంత్రి ఇటీవల మాట్లాడుతూ... అజహర్ ఆరోగ్యం బాగా లేదని, అతను తన ఇంటిని కూడా వదిలి రాని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పాడు.
మసూద్ అజహర్ మృతిపై ఇండియన్ అధికారులు మాట్లాడుతూ.. మసూద్ అజహర్ మృతిపై ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు మాత్రం అతను భవల్పూర్లో ఓ చోట మాట్లాడినట్లుగా తెలిసిందని చెప్పారు.