ఐఎస్ఐఎస్ చీఫ్ సంచలనం: ఓడిపోయాం!.. వెళ్లిపోండి లేదా చచ్చిపోండి
అరబ్బులు కాని పోరాట యోధులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని అబూ బకర్ పిలుపునిచ్చాడు. అలా కాని పక్షంలో ఆత్మాహుతి చేసుకుని తమను తాము పేల్చేసుకోవాలని సూచించాడు.
ఇరాక్: కరుడు గట్టిన ఉగ్రవాదంతో ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన ఐఎస్ఐఎస్ ఉగ్ర క్రీడకు ఇక తెరపడినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఐఎస్ఐఎస్ ఓడిపోయిందని అబూ బకర్ అంగీకరించాడు.
అంతేకాదు, అరబ్బులు కాని పోరాట యోధులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని అబూ బకర్ పిలుపునిచ్చాడు. అలా కాని పక్షంలో ఆత్మాహుతి చేసుకుని తమను తాము పేల్చేసుకోవాలని సూచించాడు. వీడ్కోలు ప్రసంగం పేరిట విడుదల చేసిన తన తాజా వీడియో ప్రసంగంలో ఈ విషయాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఆత్మాహుతికి ప్రేరేపించేలా అబూ బకర్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఆత్మాహుతి దాడి చేసుకున్నవారు స్వర్గానికి వెళ్తారని, అక్కడ వారికోసం 72మంది యువతులు ఎదురుచూస్తుంటారని పేర్కొన్నాడు.
కాగా, మోసుల్ నగరాన్ని ఇరాక్ సైన్యం పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం ఐఎస్ఐఎస్ సందిగ్ధంలో పడిపోయింది. ఆఖరికి తమ స్టేట్ కార్యాలయాన్ని కూడా ఇక మూసేయాలని అబూ బకర్ తన వీడ్కోలు ప్రసంగంలో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, అబూ బకర్ అల్ బాగ్దాదీని పట్టుకుంటే రూ.66కోట్ల నగదు బహుమతిని ఇస్తామని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014నుంచి ఐఎస్ఐఎస్ తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్ పరిధిలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకోగా, ఇరాక్ సైన్యం వాటన్నింటిని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.