చంపుతున్నారు: భారతీయ ఫైటర్లపై ఐసిస్ చిన్నచూపు
సిరియా: ప్రపంచ దేశాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్.. అరబ్, దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ తదితర దేశాల నుంచి ఎక్కువగా యువతను రిక్రూట్ చేసుకుంటోంది. అయితే వారిని జీతాలు, హోదా వంటి విషయాల్లో అందరితో సమానంగా పరిగణించడం లేదు.
అరబ్ ఫైటర్లతో పోలిస్తే భారతీయులు సహా దక్షిణాసియా వాసులు గొప్ప పోరాట యోధులు కాదని ఐఎస్ఐఎస్ భావిస్తోంది. అరబ్ ఫైటర్ల కంటే వారిని తక్కువ స్థాయిగా చూస్తున్నట్టు ఇంటలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ఇంటలిజెన్స్ సంస్థలు రూపొందించిన ఈ నివేదికను భారత్ సంస్థలకు అందజేశాయి.
ఆ నివేదిక ప్రకారం.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ దేశాల నుంచి ఐఎస్ఐఎస్లో చేరిన ఉగ్రవాదులను అరబ్ ఫైటర్ల కంటే తక్కువ స్థాయిలో పరిగణిస్తున్నారు. అరబ్ ఫైటర్లకు ఆఫీసర్ కేడర్ స్థాయి కల్పించి, ఆత్యాధునిక ఆయుధాలు, వేతనాలు, వసతులు కల్పిస్తున్నారు.
కాగా, దక్షిణాసియా వారికి మాత్రం అరబ్ ఫైటర్ల కంటే తక్కువ హోదా, జీతాలు ఇచ్చి, చిన్న చిన్న బ్యారక్లలో ఉంచుతున్నారు. అంతేగాక, ఇరాక్, సిరియాల్లో ఆత్మాహుతి దాడులకు ఎక్కువగా వీరినే ఉసిగొల్పుతున్నారు.
పేలుడుపదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని ఇచ్చి, సమీప లక్ష్యంలో దాడులకు పంపుతున్నారు. ఐఎస్ఐఎస్ లో 23 మంది భారతీయులు చేరగా, వారిలో ఆరుగురు ఉగ్రవాద చర్యల్లో మృతి చెందారు. వీరిలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అథీఫ్ వసీమ్ మొహమ్మద్, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మొహమ్మద్ ఉమర్ సుభాన్, అదే రాష్ట్రంలోని భత్కల్కు చెందిన అబ్దుల్ కదీర్ సూల్తాన్ అర్మార్, మహారాష్ట్రలోని థానేకు చెందిన సహీం ఫరూఖీ టంకీ, బెంగళూరుకు చెందిన ఫయీజ్ మసూద్, ఉత్తరప్రదేశ్లోని అజాంఘర్కు చెందిన మొహమ్మద్ సజీద్ అలియా బడా సజీద్ ఉన్నారు.
భారత్తో సహా దక్షిణాసియా, కొన్ని ఆఫ్రికా దేశాలకు చెందిన ఫైటర్లను ఉగ్రవాద దాడుల్లో సైనికుల మాదిరిగా ముందుకు ఉసికొల్పుపుతూ అరబ్ ఫైటర్లు వెనక ఉంటున్నట్టు నివేదిక వెల్లడించింది.