చికిత్సకు నిరాకరించారని, 10 మంది వైద్యులను కాల్చి చంపారు
బాగ్దాద్: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. తమ సభ్యులకు సర్జరీ చేసేందుకు నిరాకరించారని.. 10 మంది వైద్యులను కాల్చి చంపేశారు. అంతేగాక, వైద్యులను కాల్చి చంపిన దృశ్యాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ దారుణ ఘటన మోసుల్ నగరం సమీపంలోని ఎడారి ప్రాంతంలో చోటుచేసుకొంది. ఇరాక్ సైన్యం ఆధీనం నుంచి మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకొన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు మైనారిటీ గ్రూపుల నుంచి ఎదురుదాడులు ప్రారంభమయ్యాయి.
ఈ దాడుల్లో గాయపడిన ఉగ్రవాదులను చికిత్స కోసం స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారు చికిత్స చేయడానికి నిరాకరించారు. దాంతో ఆ డాక్టర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో చంపేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారి మొవాఫాక్ హమీద్ అజావి ధ్రువీకరించారు.
ఇప్పుడు మొత్తం నగరమే ఐఎస్ఐఎస్ చేతుల్లో 'బహిరంగ జైలు'గా మారిపోయిందని ఆయన చెప్పారు. సున్నీ తెగకు చెందిన 60 మంది యోధులను కూడా ఇటీవల టెర్రరిస్టులు దారుణంగా చంపేశారని ఆయన తెలిపారు. కాగా, గత అక్టోబర్లో కూడా ఇద్దరు మహిళా వైద్యులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు.