తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ-కాబూల్ దాడిలో కీలక కమాండర్ ను హతమార్చిన ఐసిస్
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు ఐసిస్ నిద్ర పట్టనీయడం లేదు. ఇప్పటికే వరుస దాడులతో తాలిబన్లను బెంబేలెత్తిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు.. తాజాగా కాబూల్ లో మరో దాడికి పాల్పడ్డారు. ఇందులో తాలిబన్ల సీనియర్ కమాండర్ అయిన హమ్దుల్లా మోఖ్లిస్ ను హతమార్చారు.
కాబూల్ లోని సర్దార్ మొహమ్మద్ దావూద్ ఖాన్ మిలటరీ ఆస్పత్రి వద్ద నిన్న రెండు బాంబుదాడులు జరిగాయి. ఆ తర్వాత భారీ ఎత్తున తాలిబన్ కమాండర్లు, ఐసిస్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఇందులో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన తాలిబన్ సీనియర్ కమాండర్ హమ్దుల్లా మోఖ్లిస్ దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆప్ఘన్ లో అధికారం చేపట్టాక తాలిబన్లకు ఇదే భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ దాడికి తామే కారణమని ఐసిస్ ప్రకటించుకుంది. ఐసిస్ కే (ఖోరాసన్) తాజా ప్రకటనలో బాంబుదాడులతో పాటు కాల్పులకూ తామే బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఐదు ఐఎస్ గ్రూపుల ఫైటర్లు పాల్గొన్నట్లు వెల్లడించింది.

ఈ దాడి ద్వారా ఐఎస్ ఉగ్రవాదులు ఆస్పత్రిలోని పౌరులతో పాటు డాక్టర్లు, రోగులను కూడా టార్గెట్ చేసినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జహీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. అయితే దాడి మొదలైన 15 నిమిషాల వ్యవధిలోనే తాలిబన్ ఫైటర్లు ఎదురుదాడి ప్రారంభించి వారిని తరిమికొట్టినట్లు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా గతంలో అమెరికా బలగాలు వదిలివెళ్లిన హెలికాఫ్టర్ లో ఆస్పత్రి పై కప్పు నుంచి కిందకు దిగి ప్రతిదాడి చేసినట్లు ముజాహిద్ వెల్లడించారు. ఆస్పత్రి ఎంట్రన్స్ వద్ద ఓ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని, ఆ తర్వాత కాల్పులు జరుపుతూ ఐసిస్ ఉగ్రవాదులు ఆస్పత్రికి చొరబడేందుకు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ప్రయత్నాన్ని తాలిబన్ ఫైటర్లు దీటుగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications