ఫుట్ బాల్ ప్లేయర్స్ పై ఐసిస్ ఘాతుకం : తలలు నరికి..
రక్కా : ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. మత ఛాందస వాదానికి కేరాఫ్ గా మారిన ఐసిస్, తమ నిబంధనలను బేఖాతరు చేసేవారిని నిర్ధాక్షిణ్యంగా హతం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫుట్ బాల్ ఆడడం తమ నిబంధనలకు వ్యతిరేకమన్న కారణంతో నలుగురు ఫుట్ బాల్ ఆటగాళ్లను అత్యంత కిరాతంగా హత్య చేసింది ఐసిస్.
సిరియాలో జరిగిన ఈ దారుణంలో.. తమ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో, సిరియాలోని ప్రముఖ ఫుట్ బాల్ టీమ్ అల్ షహబ్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న నలుగురు ఫుట్ బాల్ ఆటగాళ్ల తలలు నరికేసింది ఐసిస్. ఇస్లాం మత ఆచారలకు ఫుట్ బాల్ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో ఐసిస్ ఫుట్ బాల్ ఆటను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, అల్ షహబ్ టీమ్ ఫుట్ బాల్ ఆఢడంతో పాటు, కుర్దిష్ తిరుగుబాటుదారులకు సహకరిస్తున్నారన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది ఐసిస్. ఐసిస్ ఉగ్రవాదులకు కేరాఫ్ గా మారిన రక్కాలో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తలలు నరికిన అనంతరం నలుగురు క్రీడాకారుల మ్రుత దేహాలను బహిరంగ ప్రదేశంలో పడేసింది ఐసిస్. దీంతో ఐసిస్ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.