Israel:గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయెల్.. యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందా?
Israel:తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి హమాస్ నిరాకరించింది. దీంతో గాజాకు పంపే అంతర్జాతీయ మానవతా సహాయాన్ని అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ఇకపై గాజాలోకి ఎటువంటి వస్తువులను అనుమతించదని ఇజ్రెయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సమయంలో ఈ నిర్ణయం వచ్చింది. దీనికి కారణం కాల్పుల విరమణను పొడిగించడానికి హమాస్ నిరాకరించడమేనని.. ఇజ్రాయెల్ తన బందీలను విడుదల చేయకుండా పూర్తి స్థాయి కాల్పుల విరమణను అనుమతించదని ప్రధాన మంత్రి నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణను పొడిగించాలన్న అమెరికా ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగిసింది. ఇటీవల ఈజిప్టు, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో మానవతా సహాయం పెరిగింది. ఈ క్రమంలోనే రంజాన్ సందర్భంగా తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ ప్రతిపాదించారు. దీనిలో భాగంగా హమాస్ తమ ఆధీనంలోని పలువురు బందీలను విడుదల చేయాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీనికి హమాస్ నిరాకరించడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తన దళాలను ఉపసంహరించుకుని శాశ్వత కాల్పుల విరమణకు బదులుగా హమాస్ డజన్ల కొద్దీ మిగిలిన బందీలను విడుదల చేసే రెండో దశపై ఇరు పక్షాలు ఇంకా చర్చలు జరపలేదు. రెండో దశ కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు కైరోలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications