ఇజ్రాయెల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఇజ్రాయెల్: మనదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, పర్వదినాల పట్ల విదేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. మన సంప్రదాయాలు, పండగలు విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా, ఇజ్రాయెల్లోని బర్కాయి పట్టణంలో శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరగడమే దీనికి నిదర్శనం.
వందల మంది భక్తులు.. వారిలో అత్యధికులు యూదులు పాల్గొని.. హరేరామ హరేకృష్ణ కీర్తనలతో హోరెత్తించారు. దేశంలోని వ్యవసాయ ఆధారిత పట్టణమైన కిబ్బుట్జ్ బర్కాయి.. దాని పరిసర ప్రాంత హారిష్ టౌన్షిప్ వాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
హారిష్ పట్టణ వాసుల కుటుంబీకులను భారత్లో పర్యటనకు వచ్చినప్పుడు బృందావనం, మాయాపూర్ తదితర ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకల నిర్వహణ తీరు ఆకట్టుకుంది. భారత్ సంస్కృతి, సంప్రదాయాలు తనను బాగా ఆకర్షించాయని, స్థానికులు కూడా సహకరిస్తున్నారని కరెన్ అనే హారిష్ వాసి చెప్పారు.
ఆయన జెరూసలేం నుంచి వచ్చి ఈ టౌన్షిప్లో స్థిరపడ్డాడు. 14 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ వేడుకల్లో తాను తప్పనిసరిగా పాల్గొంటానన్నారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడి వేషధారణలతో కళారూపాల ప్రదర్శన, గేయాలాపన, రాత్రి పొద్దుపోయే వరకు నృత్యాలతో వేడుకలు వైభవంగా సాగాయి.