టెక్కీలకు గుడ్న్యూస్! 2 లక్షల మందికి జాబ్స్, ఎక్కడంటే...
టోక్యో: ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ టెక్కీలకు ఇది నిజంగా శుభవార్తే. అంతేకాదు, విదేశాల్లో స్థిరపడాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ఐటీ ఉద్యోగంలో రాణించాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఓ మంచి చాన్స్. జపాన్ దేశం దాదాపు 2 లక్షల మంది భారత ఐటీ నిపుణులను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పుల కారణంగా కొన్నేళ్ల నుంచి భారత్లో ఐటీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమెరికా హెచ్1బీ వీసాల విషయంలో నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వాటి సంఖ్యను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగం నిమిత్తం అమెరికాలో వెళ్లాలనుకునే వారికి నిరాశే ఎదురైంది.
ఇప్పుడు జపాన్ నిర్ణయంతో ప్రతిభ గల భారత ఐటీ నిపుణులకు ఊరట లభించనుంది. ప్రత్యేకంగా లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, సర్వీసెస్, అగ్రికల్చర్ రంగాల్లో అత్యంత నైపుణ్యంగల నిపుణులను నియమించుకునేందుకు జపాన్ ఆసక్తి చూపిస్తోంది. ఒక ఏడాది వ్యవధిలో శాశ్వత నివాస హోదా పొందడానికి ఎంపికైన ఉద్యోగులకు గ్రీన్కార్డ్ కూడా ఇచ్చేందుకు సహకరిస్తామని చెబుతోంది.
భారత్ నుంచి దాదాపు 2 లక్షల మంది ఐటీ నిపుణులకు జపాన్ తలుపులు తెరుస్తోంది. జపాన్లో స్థిరపడటానికి గ్రీన్ కార్డులు ఇవ్వడంతోపాటు, అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, మౌలిక వసతులకు సాయం అందించడానికి జపాన్ సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జేఈటీర్వో) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిజెకీ మైద గురువారం తెలిపారు.