మంటల్లో విమానం: ప్రాణాలు పోతాయని తెలిసీ ల్యాప్టాప్ కోసం వెంపర్లాట!
దుబాయ్: ఓ వైపు విమానం క్రాష్ ల్యాండింగ్ విమానంలో దట్టమైన మంటలు అలుముంటున్నాయి. వెంటనే బయటికి వెళ్లి ప్రాణాలు దక్కించుకోవాలని విమాన సిబ్బంది చెబుతూనే ఉన్నారు. అయినా వినకుండా ప్రాణాలు పోతాయని తెలిసినా.. తమ ల్యాప్టాప్, సెల్ఫోన్ల కోసం పాకులాడారు కొందరు ప్రబుద్ధులు.
విమానం గాలిలో ఉండగానే మంటలు, అందరూ మనోళ్లే! (వీడియో)
దుబాయ్లో ఎమిరేట్స్ విమానం బుధవారం క్రాష్ ల్యాండై మంటల్లో కాలిబూడిదైన విషయం తెలిసిందే. అయితే అంతకు కొద్ది క్షణాల ముందు కొందరు కేరళ ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. విమాన సిబ్బంది దిగండంటూ హెచ్చరించినా వాళ్లు వినలేదు. ఇంతా చేసి వాళ్లు అంత రిస్క్ చేసింది తమ లగేజీ కోసమే.
విమానం మంటల్లో చిక్కుకున్న సమయంలోనూ ఒకరు తమ బ్యాగు కోసం.. మరొకరు ల్యాప్టాప్ కోసం వెంపర్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఓ వైపు విమానంలో ఓ విమాన సిబ్బంది పారాషూట్ సాయంతో కిందకి దూకండంటూ హెచ్చరిస్తున్నా.. ప్రయాణికులు మాత్రం తమ లగేజీ తీసుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. వీరితో పాటు పలు ప్రయాణికులు తమ ఫోన్లు, ల్యాప్టాప్ల కోసం వెంపర్లాడటం గమనార్హం.
దుబాయ్ ఎయిర్పోర్ట్లో బుధవారం జరిగిన ఈ ఘటనతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల ఈ ఎయిర్పోర్ట్ను కొద్ది గంటల పాటు మూసివేశారు. చెన్నై, కోల్కతా, ఇతర ప్రాంతాల నుంచి దుబాయ్ వెళ్లే పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు.