Khamenei మరణం-పశ్చిమ ఆసియాలో ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు..తదుపరి అడుగు ఎటు?
పశ్చిమ ఆసియా రాజకీయాల్లో పెను భూకంపం సంభవించింది. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు 40 మంది అగ్రశ్రేణి కమాండర్లు టెహ్రాన్ నడిబొడ్డున జరిగిన మెరుపు దాడిలో మరణించారన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అంతర్గత భద్రత వైఫల్యం, ఆ దేశం తీర్చుకోబోయే ప్రతీకారం మరియు అణు కార్యక్రమంపై లెఫ్టినెంట్ కల్నల్ ఎ. రెడ్డి అందించిన ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం మీకోసం..
భద్రతా వైఫల్యమా? వ్యవస్థ కుప్పకూలిందా?
టెహ్రాన్ వంటి హై-సెక్యూరిటీ జోన్లో ఇంతటి భారీ ఆపరేషన్ జరగడం ఇరాన్ నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే సంకేతాలను ఇస్తోంది. అయితే,ఇరాన్ అధికారం కేవలం ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఉండదు.అక్కడ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్'అనే శక్తివంతమైన వ్యవస్థ ఉంటుంది.2014లోనే ఖమేనీ వారసుడిని రహస్యంగా ఎంపిక చేశారని సమాచారం.ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు న్యాయశాఖ అధిపతితో కూడిన ముగ్గురు సభ్యుల కౌన్సిల్ తాత్కాలికంగా పాలన సాగిస్తుంది.

ప్రతీకారం:ముంచుకొస్తున్న క్షిపణి యుద్ధం
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఊరికే ఉంటుందని భావించడం పొరపాటే.ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగంపై,గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు,క్షిపణులతో దాడులు ప్రారంభించింది.
- పరోక్ష యుద్ధం (Proxy War): హిజ్బుల్లా (లెబనాన్), హూతీలు (యెమెన్), ఇరాక్ మరియు సిరియాలోని మిలీషియా గ్రూపులను ఇరాన్ రంగంలోకి దింపే అవకాశం ఉంది.
- ట్యాంకర్ యుద్ధం: పర్షియన్ గల్ఫ్ మరియు హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను అడ్డుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది.
ఇరాన్ అణు కార్యక్రమం..ప్రస్తుత పరిస్థితి ఏంటి?
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)నివేదికల ప్రకారం..ఇరాన్ తన అణు కేంద్రాల్లో తనిఖీలను నిరాకరిస్తోంది.
- యురేనియం నిల్వలు:గతంలో ఇరాన్ 60% వరకు యురేనియంను శుద్ధి చేసింది.అణ్వాయుధం తయారు చేయడానికి 90% శుద్ధి అవసరం.ప్రస్తుతం ఇరాన్ వద్ద ఎన్ని బాంబులకు సరిపడా ఇంధనం ఉందో స్పష్టత లేదు.
- క్షిపణి సంపద:ఇరాన్ వద్ద ఇప్పటికీ 3,000 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.'ఫతే-110','ఖొర్రంషహర్'వంటి శక్తివంతమైన క్షిపణులు ఇజ్రాయెల్ను తాకగలవు.
భారత్లో ఆందోళనలు ఎందుకు?
ఖమేనీ మరణ వార్త రాగానే జమ్మూ కాశ్మీర్,లక్నో మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి.దీనికి కారణం ఇరాన్ స్థాపకుడు ఖొమేనీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ (కింటూర్)తో ఉన్న పూర్వీకుల సంబంధం.అలాగే హైదరాబాద్ వంటి నగరాల్లో పర్షియన్ సంస్కృతి ప్రభావం,షియా వర్గంతో ఉన్న మతపరమైన అనుబంధం వల్ల ఇక్కడి ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఇరాన్ మహిళల స్థితిగతులు..పాశ్చాత్య ప్రచారం
ఇరాన్ అంటే కేవలం హిజాబ్, ఆంక్షలు మాత్రమే కాదు.ఇతర మధ్యప్రాచ్య దేశాలతో పోలిస్తే ఇరాన్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువ.అక్కడ డాక్టర్లు,టీచర్లు మరియు టాక్సీ డ్రైవర్లలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే,అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల సామాన్యుల జీవితాలు చితికిపోతున్నాయని,దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని లెఫ్టినెంట్ కల్నల్ ఎ. రెడ్డి విశ్లేషించారు.
ఇరాన్ ఇప్పుడు ఒక సంధి దశలో ఉంది.తన అత్యున్నత నేతను కోల్పోయిన గాయం ఆ దేశాన్ని మరింత కరుడుగట్టిన విధానాల వైపు నడిపిస్తుందా? లేక అంతర్గత తిరుగుబాట్లు వ్యవస్థను మారుస్తాయా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఇరాన్ అనుసరిస్తున్న 'అసిమెట్రిక్ వార్ఫేర్' (అసమాన యుద్ధం) వల్ల రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంధన ధరలు భద్రతా సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం.












Click it and Unblock the Notifications