జనంపైకి మరో చైనా వైరస్: కిడ్నీ, లివర్ కంప్లీట్ ఎఫెక్ట్
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొంది చైనా. హ్యూబె ప్రావిన్స్లోని వుహాన్ ఫిష్ మార్కెట్లో తొలిసారిగా కోవిడ్ను గుర్తించారు. అక్కడి నుంచి క్రమంగా ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టుముట్టిందీ మహమ్మారి. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఒక్క భారత్లోనే అయిదు లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 64,42, 417గా తేలింది.
ఇప్పటికీ కరోనా ముప్పు అనేది పూర్తిగా తొలగిపోలేదు. భారత్ సహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారత్లోనూ కొత్తగా 16 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాంటి ప్రమాదకరమైన కోవిడ్ వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన చైనాలో.. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని పేరు లంగ్యా వైరస్. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో చైనా వైరస్ ప్రపంచం మీదికి వచ్చినట్టే.
నావల్ లంగ్యా హెనిపా వైరస్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే 35 మంది దీని బారిన పడ్డారు. చైనా ఈశాన్య ప్రాంతంలోని షాండాంగ్, హెనన్ ప్రావిన్స్లల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. వైరస్ లక్షణాలతో పలువురు స్థానిక ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. పశువుల నుంచి మనుషులకు వ్యాపించినట్లు నిర్ధారించారు. ఎలుకను పోలి ఉండే జంతువులో తొలిసారిగా ఈ వైరస్ కనిపించింది. దాని నుంచి మనుషులకు సోకినట్లు గుర్తించారు.
ఈ ఎలుకలను పోలివుండే జంతువుల్లోనే అధికంగా ఈ వైరస్ ఉంటుందని చెప్పారు. దీని వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చైనా హెల్త్ కమిషన్ తెలిపింది. దాని జినోమ్ సీక్వెన్సింగ్ను ఎప్పటికప్పుడు నిర్ధారించడానికి లాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇది సోకితే మూత్రపిండం, కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తైపే టైమ్స్ పేర్కొంది. జీవశాస్త్ర పరిశోధకుల పేర్లను తన కథనంలో ఉటంకించింది.