లాంగ్యా వైరస్: చైనాలో కనిపిస్తున్న ఈ వైరస్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమి చెబుతున్నారు?
ప్రపంచంలో మరో కొత్త వైరస్ పేరు వినిపిస్తోంది. హెనిపావైరస్ కుటుంబానికి చెందిన మరో కొత్త వైరస్ను కనిపెట్టినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ వైరస్ మనుషుల్లో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని చెబుతున్నారు. చైనాలో 2018 - 2021 మధ్యలో కనీసం 35 మందికి లాంగ్యా హెనిపావైరస్ వల్ల ఇన్ఫెక్షన్ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సంక్రమించినట్లు ఆధారాలు లేవని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఆగస్టు 04న ప్రచురితమయిన లేఖలో పేర్కొన్నారు.
ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా జంతువుల నుంచి వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఎలుక మాదిరిగా కనిపించే 'ష్రూ' అనే పేరున్న జంతువులు లాంగ్యా వైరస్కు నిలయంగా ఉంటాయని అధ్యయన బృందం తెలిపింది. అయితే, ఈ విషయాన్ని అధ్యయనాలు మరింత ధృవీకరించాల్సి ఉంది.
చైనాలో ఇన్ఫెక్షన్ సోకిన 35 కేసుల్లో 26 కేసులను నిశితంగా విశ్లేషించారు. ఇన్ఫెక్షన్ సోకిన రోగులందరికీ జ్వరం వచ్చింది. 54% మందిలో అలసట, 50% మందికి దగ్గు, 35% మందికి తలనొప్పి మరో 35% మందికి వాంతులు అయ్యాయి. 35% మందిలో కాలేయం, మూత్రపిండాల పని తీరులో కూడా మార్పులు కనిపించాయి. అయితే, ఈ వైరస్ సోకి ఎవరూ మరణించినట్లు సమాచారం లేదు.
ఈ కొత్త వైరస్ కనిపించినంత మాత్రాన ఇది మరో మహమ్మారికి సంకేతమని అనుకునేందుకు లేదు అని కొంత మంది నిపుణులు బీబీసీకి తెలిపారు.
కానీ, ఈ హెనిపా వైరస్ కుటుంబానికి చెందిన ఇతర పాథో జెన్ల వల్ల గతంలో ఆసియా, ఓషియానియా ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్లు తలెత్తాయి. ఇది ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు.
- డెల్టాక్రాన్: ఈ కొత్త కోవిడ్-19 వేరియంట్తో ఫోర్త్ వేవ్ వస్తుందా?
- 'ఈమె కావాలనే కోవిడ్ బారిన పడ్డారు’, ఆ తర్వాత ఏమైందంటే...
"హాట్ స్పాట్ ఉండదు "
హెన్డ్రా హెనిపావైరస్ (హెచ్ఇవి) , నిపా హెనిపావైరస్ (ఎన్ఐవి)కు దగ్గరిబంధువైన ఎల్ఏవైవి వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ లు తీవ్రస్థాయిలో తలెత్తాయి.
హెన్డ్రా ఇన్ఫెక్షన్లు అరుదుగా వస్తుంటాయి. హెన్డ్రావైరస్ మొదటి సారి ఆస్ట్రేలియాలో గుర్రాల్లో కనిపించింది. ఈ వైరస్ సోకడం వల్ల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చెప్పింది. ఈ వైరస్ సోకడం వల్ల మరణాల రేటు 57% ఉండేది.
1998-2018 మధ్యలో తలెత్తిన నిపా ఇన్ఫెక్షన్ల వల్ల మరణాల రేటు 40-70% మధ్యలో ఉంది. ఈ రెండు వైరస్ల వల్ల శ్వాసకోశ, నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 2018లో భారతదేశంలోని కేరళలో 19 నిపా కేసులు నమోదు కాగా 17 మంది మరణించారు.
అయితే, వీటికి సంబంధించిన డేటా సేకరణకు వివిధ దేశాలు అవలంబించిన పద్ధతులు, కేసులు తలెత్తిన సమయంలో తేడాలు ఉండటంతో కోవిడ్ సమయంలో ఏర్పడిన మరణాలతో పోల్చి చూడటం కష్టం.
కానీ, కరోనా మహమ్మారి సమయంలో కంటే కూడా హెన్డ్రా, నిపా వైరస్ సోకినప్పుడు ఏర్పడిన మరణాలు మాత్రం ఎక్కువేనని చెప్పవచ్చు. కరోనావైరస్ మొదట చైనాలో డిసెంబరు 2019లో కనిపించింది.
"లాంగ్యా వైరస్ కొత్త మహమ్మారికి సంకేతమని చెప్పలేం" అని సావోపాలో యూనివర్సిటీలో ఎమర్జింగ్ వైరస్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రొఫెసర్ యాన్ సేన్ అరౌ అన్నారు.
ఈ వైరస్ బారిన పడిన కేసులను శాస్త్రవేత్తలు సుదీర్ఘ సమయం పర్యవేక్షించారు.
"ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందిన కరోనావైరస్ మాదిరిగా ఈ రోగం వృద్ధి చెందదని గమనించాం" అని అరౌ చెప్పారు.
ఈ వైరస్కు మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే సామర్ధ్యం లేదని యూకే లోని రీడింగ్ యూనివర్సిటీలో వైరాలజీ ప్రొఫెసర్ ఇయాన్ జోన్స్ చెప్పారు.
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- 'మా నాన్న కనీసం ఆసుపత్రిలో చనిపోయారు, వేలాది మంది రోడ్ల మీదే ప్రాణాలొదిలారు’
"మ్యూటేషన్ సంకేతాలు లేవు"
"నిపా లేదా హెన్డ్రా వైరస్ల వల్ల మహమ్మారులు తలెత్తినట్లు సంకేతాలెప్పుడూ కనిపించలేదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
"ఇవి మరింత మ్యూటేషన్ అయి వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు లేవని, లాంగ్యా విషయంలో కూడా ఇదే మాదిరిగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు" అని ప్రొఫెసర్ జోన్స్ చెప్పారు.
కానీ, లాంగ్యా వైరస్ కేసులను మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరముందని చెబుతున్నారు.
లాంగ్యా వైరస్ బారిన పడిన వారంతా చైనాలోని షాన్డోంగ్, హెనాన్ ప్రావిన్సులకు చెందినవారే ఉన్నారు. రోగులకు ఒకరితో ఒకరు దగ్గరగా మెలిగినట్లు లేదా ఒకే ప్రాంతం నుంచి వచ్చినట్లు కానీ చరిత్ర లేదు. బంధువులతో కలిసిన 9 మంది రోగులను అధ్యయనకారులు ట్రేస్ చేయగా, వారి మధ్య ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలలేదు.
ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో సగం మంది రైతులే ఉన్నారు. ఈ వైరస్ జంతువుల నుంచి సోకిందని చెప్పేందుకు ఇది కొంత ఆధారాన్నిస్తోంది.
పెంపుడు, అడవి జంతువుల్లో లాంగ్యా జన్యువుల తీరును పరిశీలిస్తున్నప్పుడు, ఈ వైరస్ ష్రూ జంతువుల్లో ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వైరస్ కోసం విశ్లేషణ చేసిన 25 శాతానికి పైగా ఎలుకల్లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ జంతువులు ఈ వైరస్కు సహజ నిలయాలుగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ, ఈ వైరస్ వల్ల మనుషుల్లో మాదిరిగా వాటిలో ఎటువంటి రోగం కనిపించటం లేదు.
వైరస్ స్థావరం గబ్బిలాలు
లాంగ్యా వైరస్కు బంధువులు అని చెప్పే నిపా, హెన్డ్రావైరస్లు గబ్బిలాల్లో సహజంగా ఉంటాయని చెబుతారు.
అయితే, హెన్డ్రావైరస్ వల్ల మనుషుల్లో వ్యాప్తి చెందుతున్న కేసులు లేవని సీడీసీ చెప్పింది. ఇది శరీరంలోని ద్రవాలు, కణజాలం, లేదా ఇన్ఫెక్షన్ సోకిన గుర్రం వ్యర్ధాల ద్వారా సోకుతుంది.
మరో వైపు నిపా వైరస్ మాత్రం ఇన్ఫెక్షన్ సోకిన గబ్బిలాలు వాటి శరీరం నుంచి వెలువడే ద్రవాల వల్ల లేదా ఎన్ఐవి వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా మెలగడం వల్ల సోకుతుంది.
హెన్డ్రా, నిపావైరస్ సోకినప్పుడు ప్రత్యేకమైన చికిత్స లేదని హెనిపావైరస్లకు సంబంధించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిశోధనలకు సంబంధించిన పత్రాలను 2021లో బ్రెజిల్లోని లోంద్రీనా యూనివర్సిటీలో యానిమల్ వైరాలజిస్ట్ డాక్టర్ మిషెల్ లూనార్డీ ప్రచురించారు.
ఒక వినాశకరమైన మహమ్మారికి దారి తీసే సామర్ధ్యం ఎన్ఐవి వైరస్కు ఉందని తేల్చారు. కానీ, ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ప్రొఫెసర్ జోన్స్ భావిస్తున్నారు. "నిపా వల్ల మహమ్మారికి దారి తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. వీటి వల్ల కొంత ముప్పు ఉంటుంది. కానీ దీనికి వ్యాక్సీన్ తయారు చేయాల్సిన అవసరం లేదు. అవగాహన కల్పించడం ద్వారా దీనిని నిరోధించవచ్చు" అని ఆయన వివరించారు.
నిపా వైరస్ మనుషుల నాడీ వ్యవస్థలో వేగంగా రూపాంతరం చెందుతుందని అన్నారు. దీని వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అర్ధమయిందని అన్నారు.
"కొత్త వైరస్లు తలెత్తగానే భయపడాల్సిన అవసరం లేదు. శాస్త్రవేత్తలు కొత్త వైరస్లను కనిపెడుతూనే ఉంటారు. ఇది కోవిడ్ 19 తర్వాత మరింత ఎక్కువయింది" అని జోన్స్ అన్నారు. "బయట చాలా రకాల దారుణమైన వైరస్ లు ఉన్నాయి. అవన్నీ మనకి సోకుతాయని చెప్పలేం" అని అన్నారు.
వాతావరణ మార్పులు, పెరుగుతున్న అడవుల వినాశనం ప్రపంచంలో మరిన్ని కొత్త రకాల రోగాలు పుట్టవచ్చని గతంలో ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కొన్ని జూనోటిక్ వైరస్ల వల్ల మనుషులకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)