రాంగ్ రూట్ లో విమానం: దారి మర్చిపోయిన పైలెట్
కౌలాలంపూర్: గమ్యం చేరుకోకుండా విమానం రాంగ్ రూట్ లో గంట పాటు ప్రయాణించింది. పైలెట్లు దారి మర్చిపోవడంతో అధికారులకు చెమటలు పట్టాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేశారు.
మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం న్యూజిలాండ్ నుంచి బయలుదేరి రాంగ్ రూట్ లో ప్రయాణించడంతో అధికారులు విచారణ చేపట్టారు. మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 132 విమానం న్యూజిలాండ్ లోని అక్లండ్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది.
ఈ విమానం కౌలాలంపూర్ వెళ్లాలి. విమానం ఆస్ట్రేలియా మీదుగా వాయువ్య దిశలో నేరుగా వెళ్లాలి. అయితే రాడార్ డేటాను బట్టి చూస్తే ఆ విమానం దక్షిణ దిశగా ఒక గంట పాటు రాంగ్ రూట్ లో ప్రయాణించిందని వెలుగు చూసింది.
ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలెట్లు వెంటనే అక్లండ్ ఓషియానిక్ కంట్రోల్ సెంటర్ లోని ఎయిర్ కంట్రోలర్లతో చర్చించారు. ఆ సందర్బంలో ప్రయాణికులకు విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
విమానం రాంగ్ రూట్ లో వెళ్లడం వలన ఎలాంటి ప్రమాదం జరగలేదని, క్షేమంగా గమ్యస్థానం చేరుకునిందని మలేసియా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. అయితే ఎందుకు మార్గాన్ని మార్చారనే విషయంపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.