ఎహెచ్ 370: అక్కడ కూలిందా? ఫోన్లో మహిళతో పైలట్
కౌలాలంపూర్: గల్లంతైన మలేసియా విమానం ఎంహెచ్ 370 తాలూకు శకలాలుగా భావిస్తున్న వస్తువులను దక్షిణ హిందూ మహాసముద్రంలో కనుగొన్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదివారం కొన్ని ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. వీటిని ఆస్ట్రేలియా దేశానికి చెందిన అన్వేషణ బృందానికి అందజేశామని మలేసియా రవాణా శాఖ తెలిపింది.
ఆ ప్రాంతంలో విమాన శకలాలు ఉన్నట్టు తొలుత ప్రకటించిన ఆస్ట్రేలియా కూడా ఆదివారం సరకు రవాణాలో భాగంగా ప్యాకేజింగ్కు ఉపయోగించే చెక్క పెట్టెను కనుగొన్నట్టు తెలిపింది. దాంతో పాటు చిన్నచిన్న శకలాలు చాలానే కనిపించినట్టు ఆ దేశ ప్రధాని టోనీ అబ్బాట్ చెప్పారు.

దక్షిణ హిందూ మహాసముద్రంలో ఇలా వరుసగా.. ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు ఉపగ్రహ చిత్రాల్లో రోజుకొక వస్తువు కనిపిస్తున్న నేపథ్యంలో విమానం అక్కడే కూలి ఉండవచ్చని మలేసియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మరిన్ని విమానాలను అన్వేషణ నిమిత్తం రంగంలోకి దించారు.
ఆస్ట్రేలియాకు చెందిన రెస్క్యూ సమన్వయ కేంద్రం 8 విమానాలను ఆ ప్రాంతంలో శోధనకు నియోగించింది. అలాగే.. ఇండియన్ నేవీకి చెందిన పి8 పొసెయ్డన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-130జె విమానాలు ఈ అన్వేషణలో పాలుపంచుకుంటున్నాయి.
పైలట్తో మాట్లాడిన మహిళ
గల్లంతైన మలేషియా విమానం పైలట్ చివరిసారిగా ఓ మహిళతో మాట్లాడినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అయిన సమయంలో పైలట్ ఓ ఫోన్ కాల్ మాట్లాడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫోన్ కాల్ మహిళదిగా అధికారులు గుర్తించారని సమాచారం. ఆ మొబైల్ నెంబర్ను తప్పుడు అడ్రస్తో తీసుకున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications