గగుర్పొడిచే సాహసం: 'హ్యూమన్ స్టీమింగ్' లైవ్ షోలో విషాదం, ఆ 30ని. తర్వాత!
ఈసారి ఆ 30నిమిషాలు గడిచేసరికి అతను ప్రాణాలు కోల్పోయాడు.
కౌలాలంపూర్: మలేషియాలో లైవ్ ప్రదర్శన ఇస్తున్న సందర్భంగా ఓ స్టంట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఏళ్లుగా 'హ్యూమన్ స్టీమింగ్' ప్రదర్శనతో అబ్బురపరుస్తూ వస్తున్న అతను.. తాజా ప్రదర్శనలో మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.
మలేషియాకు చెందిన లిమ్ బా(68) కేదా రాష్ట్రంలో జరుగుతున్న తావోయిస్ ఉత్సవాల సందర్భంగా సోమవారం హ్యూమన్ స్టీమింగ్ ప్రదర్శన ఇచ్చాడు. స్థానిక చైనీస్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను చూసేందుకు వందల మంది జనం తరలి వచ్చారు.

ప్రదర్శనలో భాగంగా.. ఎప్పటిలాగే కింద మంటపెట్టి, దానిపై ఓ చెక్క లాంటి వస్తువును పెట్టారు. దానిపై లిమ్ బా పడుకోగా.. అతనిపై ఆవిరి యంత్రాన్ని బోర్లించారు. అలా 30నిమిషాల పాటు లిమ్ బా.. అందులోనే ఉండటం ప్రతీ 'షో'లో జరుగుతోంది. కానీ ఈసారి ఆ 30నిమిషాలు గడిచేసరికి అతను ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఆవిరి వల్లో, మంట వల్లో అతను చనిపోలేదని, ఆ సమయంలో గుండెపోటు రావడం వల్లే ప్రాణాలు వదిలాడని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. పదేళ్లుగా ప్రదర్శనలు ఇస్తూ వస్తున్న లిమ్ బా.. ఇలా హఠాన్మరణం చెందడంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
నిజానికి గతేడాదే లిమ్ బాకు గుండె ఆపరేషన్ అయిందని, ఇక ప్రదర్శనలు మానుకోవాలని ఎంత చెప్పినా అతను వినలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే ఆయన చివరి ప్రదర్శన అవుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications