కొత్త ఏడాది గొడవ: భార్యాపిల్లల సహా ఏడుగురి హత్య, బలవన్మరణం
బీజింగ్: నూతన సంవత్సరం వివాదం ఓ కుటుంబాన్నే బలి తీసుకుంది. చైనా నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ స్థితిలో చైనాలోని హెబై ప్రావిన్స్లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
హెబై ప్రావిన్స్లోని గ్జియాంగౌ గ్రామంలో వ్యుషౌగువా అనే వ్యక్తి నూతన సంవత్సరం సందర్బంగా కుటుంబంలో తలెత్తిన వివాదంతో భార్యను, ఆమె తల్లిదండ్రులను, ఇద్దరు పిల్లలను, మరో ఇద్దరు దూరపు బంధువులను బలమైన వస్తువుతో కొట్టి చంపాడు. ఆ తర్వత విషం తాగి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారంనాడు ఆ ఘటన జరిగింది. పోలీసులు మంగళవారంనాడు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో దొరికిన వ్యు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబాల పునరేకీకరణ సందర్భంగా తలెత్తిన గొడవ ఆ దారుణానికి దారి తీసింది. ఏడు శవాలు వ్యు నివాసంలో పడి ఉండగా, మరో శవం సూసైడ్ నోట్తో వంద కిలోమీటర్ల దూరంలో గల కర్మాగారంలో పడి ఉన్నాయి.